జోగి రమేశ్ ఇంట్లో సిట్ తనిఖీలు పూర్తి... ఫోన్లు, సీసీ ఫుటేజ్ స్వాధీనం

  • నకిలీ మద్యం తయారీ కేసులో జోగి రమేశ్ అరెస్ట్
  • జోగి రమేశ్ ఇంట్లో కీలక ఆధారాల సేకరణ
  •  మరికాసేపట్లో కోర్టుకు!
నకిలీ మద్యం తయారీ కేసులో అరెస్టయిన మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్ నివాసంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) చేపట్టిన తనిఖీలు ముగిశాయి. ఈ సోదాల్లో ఆయనతో పాటు ఆయన భార్య మొబైల్ ఫోన్లను, ఇంట్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఆదివారం ఉదయం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేశ్ నివాసంలో సిట్ బృందాలు ఆయనను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన్ను విజయవాడలోని ఎక్సైజ్ కార్యాలయానికి తరలించి విచారించారు. మరికాసేపట్లో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి, న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నట్లు తెలుస్తోంది.

ఈ కేసులో ఏ1గా ఉన్న అద్దేపల్లి జనార్దనరావు ఇటీవల ఇచ్చిన వాంగ్మూలమే జోగి రమేశ్ అరెస్టుకు దారితీసింది. జోగి రమేశ్ ప్రోద్బలంతోనే తాను నకిలీ మద్యం తయారు చేసినట్లు జనార్దనరావు తన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. ఆఫ్రికాలో డిస్టిలరీ ఏర్పాటు చేసుకునేందుకు తనకు రూ.3 కోట్లు ఇస్తానని జోగి రమేశ్ హామీ ఇచ్చారని కూడా తెలిపాడు.

జనార్దనరావు వాంగ్మూలం ఆధారంగానే సిట్ అధికారులు జోగి రమేశ్ ఇంట్లో ల్యాప్‌టాప్‌లు, సీసీ ఫుటేజ్‌ను పరిశీలించి, కీలక ఆధారాలను సేకరించినట్లు సమాచారం. ఈ కేసులో జోగి రమేశ్ పాత్రపై అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.


More Telugu News