వరల్డ్ కప్ ఫైనల్: ప్రతి జిల్లాలో క్రీడా ప్రాధికార సంస్థ ఆఫీసుల వద్ద స్క్రీన్లు

  • మహిళల వన్డే ప్రపంచకప్‌ ఫైనల్ కోసం ఏపీలో ప్రత్యేక ఏర్పాట్లు
  • రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఎల్‌ఈడీ స్క్రీన్ల ఏర్పాటు
  • స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) ఆధ్వర్యంలో ఏర్పాటు
  • నేడు ఫైనల్‌లో భారత్, దక్షిణాఫ్రికా అమీతుమీ
  • భారత్ విజయం సాధించాలని దేశమంతా కోరుకుంటోందన్న శాప్ ఛైర్మన్
మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఇవాళ జరగనున్న ఫైనల్ మ్యాచ్‌ను ప్రజలు వీక్షించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రంలో ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేసి, మ్యాచ్‌ను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) వెల్లడించింది.

ఈ విషయంపై శాప్ ఛైర్మన్ రవి నాయుడు మాట్లాడుతూ.. ప్రతి జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ (డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ) కార్యాలయం వద్ద ఈ భారీ స్క్రీన్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రపంచకప్‌ ఫైనల్‌లో టీమిండియా విజయం సాధించాలని దేశంలోని ప్రతి ఒక్కరిలాగే తాము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. క్రీడాభిమానులు అందరూ కలిసికట్టుగా మ్యాచ్‌ను ఆస్వాదించేందుకు ఈ ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.

కాగా, మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో భాగంగా ఇవాళ భారత్, దక్షిణాఫ్రికా జట్లు టైటిల్ కోసం తలపడుతున్న విషయం తెలిసిందే. ఈ కీలక పోరుపై దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.


More Telugu News