సెంచరీ భాగస్వామ్యంతో అదరగొట్టిన ఓపెనర్లు... భారీ స్కోరు దిశగా భారత్ అమ్మాయిలు

  • మహిళల ప్రపంచకప్ 2025 ఫైనల్లో భారత్, దక్షిణాఫ్రికా ఢీ
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా
  • భారత్‌కు అదిరిపోయే శుభారంభం
  • మెరుపు అర్ధశతకంతో అదరగొట్టిన షఫాలీ వర్మ
  • తొలి వికెట్‌కు 104 పరుగుల భారీ భాగస్వామ్యం
  • 45 పరుగులు చేసి స్మృతి మంధన ఔట్
ఐసీసీ మహిళల ప్రపంచకప్ 2025 ఫైనల్ పోరులో భారత జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తుది సమరంలో టీమిండియా భారీ స్కోరు దిశగా సాగుతోంది. ఓపెనర్ షఫాలీ వర్మ (79*) మెరుపు అర్ధశతకంతో చెలరేగగా, మరో ఓపెనర్ స్మృతి మంధన (45) కీలక ఇన్నింగ్స్ ఆడింది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన భారత ఓపెనర్లు షఫాలీ వర్మ, స్మృతి మంధన జట్టుకు అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. దక్షిణాఫ్రికా బౌలర్లపై ఆధిపత్యం చెలాయిస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 104 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి పటిష్ట పునాది వేశారు.

అర్ధశతకానికి చేరువైన స్మృతి మంధన 58 బంతుల్లో 8 ఫోర్లతో 45 పరుగులు చేసి క్లో ట్రయాన్ బౌలింగ్‌లో కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగింది. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన జెమీమా రోడ్రిగ్స్‌తో కలిసి షఫాలీ తన జోరును కొనసాగించింది. దూకుడుగా ఆడుతూ 70 బంతుల్లోనే 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 79 పరుగులు చేసి క్రీజ్‌లో ఉంది.

తాజా సమాచారం అందేసరికి భారత జట్టు 25.2 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 152 పరుగులు చేసింది. క్రీజ్‌లో షఫాలీ వర్మ (79*), జెమీమా రోడ్రిగ్స్ (18*) ఉన్నారు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కు అజేయంగా 48 పరుగులు జోడించారు.


More Telugu News