రెస్టారెంట్ లో ఫుడ్ ప్యాక్ చేసుకున్న ఇండియన్ ఫ్యామిలీ... సోషల్ మీడియాలో చర్చ

  • జ్యూరిచ్ హోటల్‌లో బ్రేక్‌ఫాస్ట్ ప్యాక్ చేసిన భారత కుటుంబం
  • ఈ ఘటనపై సుమిత్ అనే వ్యక్తి ఎక్స్‌లో పోస్ట్ చేయడంతో వైరల్
  • భారతీయుల వల్లే ప్రపంచవ్యాప్తంగా చులకన భావం ఏర్పడుతోందన్న సుమిత్
  • ఇది కేవలం భారతీయులకే పరిమితం కాదంటూ నెటిజన్ల వాదన
  • ఇతర దేశాల వారు కూడా ఇలాగే చేస్తారంటూ పలువురి కామెంట్లు
  • ప్రయాణ మర్యాదలపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ
స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ నగరంలో ఓ భారత కుటుంబం ప్రవర్తించిన తీరుపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. అక్కడి ఓ హోటల్‌లో బస చేసిన ఈ కుటుంబం, బ్రేక్‌ఫాస్ట్ బఫే నుంచి ఆహారాన్ని ప్యాక్ చేసుకుని తీసుకెళ్లడం వివాదానికి దారితీసింది. ఇదే హోటల్‌లో బస చేస్తున్న సుమిత్ అనే భారతీయుడు ఈ ఘటనను ఫొటో తీసి ‘ఎక్స్’ లో పోస్ట్ చేయడంతో ఇది వైరల్‌గా మారింది. ఈ పోస్ట్‌పై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

వివరాల్లోకి వెళితే, జ్యూరిచ్‌లోని ఓ హోటల్ బ్రేక్‌ఫాస్ట్ బఫే వద్ద "ఆహారాన్ని బయటకు తీసుకువెళ్లరాదు" అని స్పష్టంగా సూచించినప్పటికీ, ఓ భారత కుటుంబం ఆ నిబంధనను ఉల్లంఘించింది. భోజనం ముగించాక వారు తమతో తెచ్చుకున్న ఖాళీ డబ్బాలలో పండ్లు, పెరుగు, ఉడికించిన గుడ్లు వంటివాటిని నింపుకున్నారు.

ఈ విషయాన్ని గమనించిన సుమిత్, ఆ కుటుంబాన్ని విమర్శిస్తూ పోస్ట్ పెట్టారు. "ఈ దృశ్యం చూసి అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. ఈ కుటుంబం స్విట్జర్లాండ్ పర్యటనకు లక్షలు ఖర్చు చేసి ఉంటుంది. అయినా ఇలా ప్రవర్తించారు. ప్రపంచవ్యాప్తంగా మనల్ని ఎందుకు చులకనగా చూస్తారో వీళ్లు నిరూపించారు" అని తన పోస్ట్‌లో ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ పోస్ట్ ఆన్‌లైన్‌లో తీవ్ర చర్చకు దారితీసింది. కొంతమంది నెటిజన్లు సుమిత్ వాదనతో ఏకీభవిస్తూ, ఇలాంటి ప్రవర్తన దేశానికి అవమానకరమని కామెంట్లు చేశారు. అయితే, చాలామంది ఆ కుటుంబాన్ని వెనకేసుకొచ్చారు. బఫే నుంచి ఆహారాన్ని ప్యాక్ చేసుకోవడం కేవలం భారతీయులకే పరిమితం కాదని, చాలా దేశాల పర్యాటకులు ఇలాగే చేస్తారని వాదించారు.


More Telugu News