శాతవాహన ఎక్స్‌ప్రెస్ రైలు స్టాపేజీపై దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం

  • శాతవాహన సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలుకు జనగామలో స్టాపేజీ
  • అక్టోబర్ 30 నుంచి ప్రయోగాత్మకంగా ఆగుతుందన్న దక్షిణ మధ్య రైల్వే శాఖ
  • ఒక నిమిషం పాటు ఆగుతుందని వెల్లడి
దక్షిణ మధ్య రైల్వే ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లా కేంద్రంలో శాతవాహన సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలుకు స్టాప్ సౌకర్యం కల్పించారు. విజయవాడ - సికింద్రాబాద్ - విజయవాడ మధ్య నిత్యం రాకపోకలు సాగించే ఈ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు ఇకపై జనగామ రైల్వే స్టేషన్‌లో ఆగుతుంది.

ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటన విడుదల చేసింది. అక్టోబర్ 30వ తేదీ నుంచి శాతవాహన సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు జనగామ రైల్వే స్టేషన్‌లో ప్రయోగాత్మకంగా ఆగుతుందని ప్రకటించింది. విజయవాడ-సికింద్రాబాద్ రైలు ఉదయం 10:14 - 10:15 గంటల మధ్య ఒక నిమిషం పాటు, సికింద్రాబాద్ - విజయవాడ రైలు సాయంత్రం 5:19 - 5:20 గంటల మధ్య జనగామ రైల్వే స్టేషన్‌లో ఒక నిమిషం పాటు ఆగుతుందని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ. శ్రీధర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.


More Telugu News