భర్తపై రాజోలు టీడీపీ ఇంఛార్జ్ అమూల్య గృహ హింస కేసు.. సంచలన ఆరోపణలు

  • రాజోలు టీడీపీ ఇంఛార్జ్ అమూల్య భర్తపై వరకట్న వేధింపుల కేసు
  • అదనపు కట్నం కోసం భర్త సునీల్ వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు
  • హత్యాయత్నం చేశాడని, ఫొటోలు మార్ఫింగ్ చేస్తానని బెదిరించాడని ఆరోపణ
  • అప్పుల వివరాలతో ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టిన అమూల్య భర్త సునీల్
  • అమూల్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన రాజోలు పోలీసులు
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు కుమార్తె గొల్లపల్లి అమూల్య తన భర్తపై వరకట్న వేధింపుల కేసు పెట్టడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. అదనపు కట్నం తీసుకురావాలంటూ తన భర్త దొమ్మేటి సునీల్ శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఆమె రాజోలు పోలీసులను ఆశ్రయించారు. అమూల్య ఫిర్యాదు మేరకు పోలీసులు సునీల్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఏముందంటే?
చదువుకునే రోజుల నుంచి స్నేహితుడైన సునీల్, తనను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుని బాగా చూసుకుంటానని నమ్మించాడని అమూల్య తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 2009 మార్చి 4న పెద్దల సమక్షంలో తమ వివాహం జరిగిందని, అప్పటి నుంచి అదనపు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టాడని తెలిపారు. తనపై రెండుసార్లు హత్యాయత్నం చేశాడని, తన ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని ఆమె ఆరోపించారు. తన భర్త నుంచి తనకు, తన పిల్లలకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు.

అప్పుల వివరాలతో భర్త ఫేస్‌బుక్ పోస్ట్
మరోవైపు ఈ ఆరోపణలపై అమూల్య భర్త సునీల్ ఫేస్‌బుక్ ద్వారా స్పందించారు. "ఈ పోస్ట్ పబ్లిక్‌గా పెట్టడం నాకు ఇష్టం లేదు. కానీ నా భార్య అమూల్య నన్ను మీడియా ముందు బ్లాక్ చేసింది. మా కుటుంబానికి చాలా అప్పులు ఉన్నాయి" అంటూ పలువురికి ఇవ్వాల్సిన ఆర్థిక లావాదేవీల వివరాలను బహిర్గతం చేశారు. నర్సాపురంలోని ఓ జ్యువెలరీ షాప్‌కు రూ. 45 లక్షలు, మరో రూ. 8 లక్షలు, తన తల్లి దగ్గర 250 గ్రాముల బంగారం, పలువురి వద్ద లక్షల్లో అప్పులు ఉన్నాయని పేర్కొన్నారు. "నేను చేసిన తప్పులన్నీ అంగీకరిస్తున్నాను. కానీ నిజాయితీగా తిరిగి నిలబడటానికి ప్రయత్నిస్తున్నాను" అని తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.

తండ్రీకూతుళ్ల మధ్య రాజకీయ వైరం
ఈ వ్యవహారానికి రాజకీయ కోణం కూడా తోడవ్వడంతో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే గొల్లపల్లి అమూల్యను రాజోలు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్‌గా నియమించారు. అయితే, ఇదే నియోజకవర్గానికి ఆమె తండ్రి, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు వైసీపీ ఇంఛార్జ్‌గా కొనసాగుతున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న సూర్యారావు, 2024 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి ఓటమి పాలయ్యారు. ఇప్పుడు తండ్రీకూతుళ్లు ఒకే నియోజకవర్గానికి వేర్వేరు పార్టీల నుంచి ఇంఛార్జ్‌లుగా ఉండటం, ఇంతలోనే అమూల్య వ్యక్తిగత జీవితంలో ఈ వివాదం చెలరేగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


More Telugu News