బంగ్లాదేశ్ యూటర్న్.. జకీర్ నాయక్‌కు ఘన స్వాగతం పలకనున్న యూనస్ ప్రభుత్వం

  • ఢాకాలో బేకరీపై ఉగ్రదాడి తర్వాత మలేసియా పారిపోయిన జకీర్ నాయక్
  • జకీర్ నాయక్‌కు చెందిన పీస్ టీవీని నిషేధించిన నాటి ప్రధాని షేక్ హసీనా
  • ఇప్పుడు జకీర్‌కు ఘన స్వాగతం పలకనున్న యూనస్ ప్రభుత్వం
వివాదాస్పద మతబోధకుడు జకీర్ నాయక్ బంగ్లాదేశ్‌లో పర్యటించనున్నారు. యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వం జకీర్ పర్యటనకు అనుమతించినట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి. జకీర్ నాయక్‌కు స్వాగతం పలికేందుకు బంగ్లాదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని సమాచారం. నవంబర్ 28 నుంచి డిసెంబర్ 20 వరకు జకీర్ నాయక్ బంగ్లాదేశ్ పర్యటన కొనసాగనుంది. జకీర్ నాయక్ బంగ్లాలోని పలు ప్రాంతాల్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

జూలై 2016లో ఢాకాలోని ఒక బేకరీపై ఉగ్రదాడి జరిగింది. ఆ దాడి అనంతరం ఒక ఉగ్రవాది మాట్లాడుతూ యూట్యూబ్ ఛానల్ ద్వారా జకీర్ చేసిన బోధనలకు తాను ప్రభావితమయ్యానని చెప్పినట్లు అధికారులు వెల్లడించారు. ఆ సమయంలో భారత్‌లో ఉన్న జకీర్ అరెస్టు భయంతో మలేసియాకు పారిపోయాడు. దీంతో మనీలాండరింగ్, విద్వేష ప్రసంగాల ఆరోపణల కేసులో భారత్ జకీర్‌ను వాంటెడ్‌గా ప్రకటించింది.

జకీర్ నాయక్‌కు చెందిన పీస్ టీవీని అప్పటి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా నిషేధించారు. అలాంటి వ్యక్తికి యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం అధికారికంగా స్వాగతం పలకనుంది. జకీర్ నాయక్ గత ఏడాది పాకిస్థాన్‌లో కూడా పర్యటించారు. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా నాడు జకీర్‌కు ఘన స్వాగతం పలికారు.


More Telugu News