11 కిలోలు తగ్గాడు, సూపర్ ఫిట్‌గా ఉన్నాడు.. ప్రపంచకప్‌కు రోహిత్ కావాల్సిందే: శ్రీకాంత్

  • 2027 ప్రపంచకప్‌కు రోహిత్ శర్మ కచ్చితంగా కావాలన్న శ్రీకాంత్
  • ఆస్ట్రేలియా సిరీస్‌లో అద్భుత ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్
  • 11 కిలోల బరువు తగ్గి సూపర్ ఫిట్‌గా కనిపిస్తున్నాడన్న మాజీ సెలక్టర్
  • రోహిత్ వయసును కారణంగా చూపొద్దని సెలక్టర్లకు సూచన
  • రోహిత్, కోహ్లీ లేకుండా ప్రపంచకప్ గెలవడం కష్టమని వ్యాఖ్య
  • నేనే సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా ఉంటే ఇప్పుడే వారిని ఎంపిక చేసేవాడినని వెల్లడి
వన్డే కెప్టెన్సీని రోహిత్ శర్మ నుంచి తప్పించి శుభ్‌మన్ గిల్‌కు అప్పగించినప్పటి నుంచి టీమిండియాలో అతని భవిష్యత్తుపై అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే, తనలో సత్తా తగ్గలేదని నిరూపిస్తూ ఆస్ట్రేలియాతో ముగిసిన వన్డే సిరీస్‌లో రోహిత్ అద్భుతంగా రాణించాడు. ఈ ప్రదర్శనతో విమర్శకుల నోళ్లు మూయించడమే కాకుండా, 2027 ప్రపంచకప్‌లోనూ తన స్థానాన్ని పదిలం చేసుకునేలా ఆడాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, మాజీ చీఫ్ సెలక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్.. రోహిత్ ఎంపికపై ఎటువంటి సందేహాలు అవసరం లేదని స్పష్టం చేశాడు.

ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో రోహిత్ శర్మ అద్భుత ఫామ్‌ను ప్రదర్శించాడు. రెండో వన్డేలో క్లిష్ట పరిస్థితుల్లో 73 పరుగులు చేయగా, సిరీస్ నిర్ణయాత్మక మూడో వన్డేలో అజేయమైన 121 పరుగులతో జట్టును గెలిపించాడు. ఈ ప్రదర్శనకు గాను 'ప్లేయర్ ఆఫ్ ద సిరీస్' అవార్డును కూడా అందుకున్నాడు. ఈ నేపథ్యంలో తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడిన శ్రీకాంత్, రోహిత్ ఫిట్‌నెస్‌ను, బ్యాటింగ్‌ను ప్రశంసించాడు.

"2027 ప్రపంచకప్‌కు రోహిత్ శర్మ కచ్చితంగా ఉండాలి. అతను, విరాట్ కోహ్లీ లేకుండా మనం ప్రపంచకప్ ఆడలేం. రోహిత్ 11 కిలోల బరువు తగ్గి సూపర్ ఫిట్‌గా కనిపిస్తున్నాడు. ఇది మనకు తెలిసిన పాత రోహిత్ శర్మ. బంతిని ఎంతో సులభంగా, ఆలస్యంగా ఆడుతూ తన క్లాస్ చూపించాడు" అని శ్రీకాంత్ వివరించాడు.

రోహిత్ వయసు 38 ఏళ్లు కావడం, ప్రపంచకప్ నాటికి 40కి చేరువ కానుండటంతో వస్తున్న విమర్శలను శ్రీకాంత్ తిప్పికొట్టాడు. "అతనికి 40 ఏళ్లు వస్తున్నాయని వయసు గురించి మాట్లాడొద్దు. అతను ఫిట్‌గా ఉన్నాడు, అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. స్లిప్స్‌లో అద్భుతమైన క్యాచ్‌లు పడుతున్నాడు. ఇంకేం కావాలి? 2019 ప్రపంచకప్‌లో ఆడినంత సులభంగా ఇప్పుడు ఆడుతున్నాడు" అని ఆయన పేర్కొన్నాడు.

అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీకి శ్రీకాంత్ ఓ కీలక సూచన చేశారు. "నేనే గనుక సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా ఉంటే, ఈరోజే వాళ్లిద్దరి (రోహిత్, కోహ్లీ) దగ్గరకు వెళ్లి 'మీరు 2027 ప్రపంచకప్‌కు ఫిట్‌గా ఉండండి, మాకు ట్రోఫీ గెలిపించండి' అని చెబుతాను," అంటూ వారిద్దరిపై తనకున్న నమ్మకాన్ని శ్రీకాంత్ బలంగా వ్యక్తం చేశారు. మూడో వన్డేలో రోహిత్, కోహ్లీ కలిసి అజేయంగా 168 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన సంగతి తెలిసిందే.


More Telugu News