మొంథా తుపాను ఎఫెక్ట్: నిర్మలా సీతారామన్ ఏపీ పర్యటన వాయిదా

  • ఈ నెల 28న అమరావతిలో పర్యటించాల్సి ఉన్న కేంద్ర మంత్రి
  • ఒకేసారి 12 బ్యాంకుల ప్రాంతీయ కార్యాలయాలకు శంకుస్థాపన
  • అదే రోజు ఉత్తర కోస్తాలో తీరం దాటనున్న మొంథా తుపాను
  • రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలకు అధికార యంత్రాంగం హెచ్చరికలు
  • త్వరలో నిర్మల పర్యటనకు కొత్త తేదీ ఖరారు చేసే అవకాశం
ఆంధ్రప్రదేశ్‌పై 'మొంథా' తుపాను ప్రభావం చూపే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్ర పర్యటన వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం, ఆమె ఈ నెల 28న రాజధాని అమరావతిలో పర్యటించాల్సి ఉంది.

బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం తుపానుగా బలపడి, ఈ నెల 28వ తేదీన ఉత్తర కోస్తాంధ్రలో తీరం దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ తుపాను ప్రభావంతో శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రమంత్రి పర్యటన వాయిదా వేశారు.

నిర్మలా సీతారామన్ అమరావతిలో ఒకే రోజున 12 జాతీయ బ్యాంకుల ప్రాంతీయ ప్రధాన కార్యాలయాలకు శంకుస్థాపన చేయాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. అయితే, తాజా వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఈ కార్యక్రమాన్ని వాయిదా వేయడమే సరైనదని భావించారు. త్వరలోనే పర్యటనకు సంబంధించిన కొత్త తేదీని ఖరారు చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.



More Telugu News