కర్నూలు బస్సు ప్రమాద బాధితులకు తెలంగాణ ప్రభుత్వం పరిహారం

  • మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం
  • గాయపడిన వారికి రూ. 2 లక్షల చొప్పున ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం
  • ప్రైవేట్ బస్సుల వేగాన్ని నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు
  • ఏపీ, కర్ణాటక మంత్రులతో త్వరలో సమావేశం
  • బస్సుల ఓవర్ స్పీడ్ నియంత్రణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు
కర్నూలు వద్ద జరిగిన కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాద బాధితులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. ఈ దుర్ఘటనలో మరణించిన తెలంగాణ వాసుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందేలా అన్ని చర్యలూ తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుగుతోందని మంత్రి తెలిపారు. బాధితులకు అవసరమైన సహాయక చర్యలను ప్రభుత్వం అందిస్తుందని భరోసా ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రైవేట్ బస్సుల మితిమీరిన వేగాన్ని నియంత్రించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నట్లు వెల్లడించారు.

ఇందులో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులతో త్వరలోనే ఒక సమావేశం నిర్వహించనున్నట్లు పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ సమావేశంలో ప్రైవేట్ బస్సుల భద్రతా ప్రమాణాలు, వేగ నియంత్రణపై కీలక నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. బస్సుల ఓవర్ స్పీడ్‌ను అరికట్టేందుకు ఒక ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రైవేట్ ట్రావెల్స్ మధ్య నెలకొన్న అనారోగ్యకరమైన పోటీ కూడా ప్రమాదాలకు ఒక కారణంగా నిలుస్తోందని, దానిని నివారించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి వివరించారు.


More Telugu News