అర్ధ శ‌త‌కాల‌తో రాణించిన రోహిత్‌, అయ్య‌ర్‌.. ఆసీస్ టార్గెట్ ఎంతంటే..!

  • ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో భారత్ ఓ మోస్తరు స్కోరు
  • 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసిన టీమిండియా
  • రాణించిన రోహిత్ (73) శ్రేయస్ అయ్యర్ (61), అక్షర్ పటేల్ (44) రాణింపు
  • ఆరంభంలోనే విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్ విఫలం
  • నాలుగు కీలక వికెట్లు పడగొట్టి భారత్‌ను దెబ్బతీసిన ఆడమ్ జంపా
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఈరోజు జ‌రుగుతున్న రెండో మ్యాచ్‌లో టీమిండియా ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. అడిలైడ్ వేదికగా జరుగుతున్న‌ ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు తడబడటంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 264 పరుగులు మాత్రమే చేయగలిగింది. రోహిత్ శ‌ర్మ (73), శ్రేయస్ అయ్యర్ (61) అర్ధ శ‌త‌కాల‌తో రాణించ‌గా... అక్షర్ పటేల్ (44), హ‌ర్షిత్ రాణా (24) కీలక ఇన్నింగ్స్‌లు ఆడటంతో భారత్ ఆ మాత్రం స్కోరైనా సాధించగలిగింది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అతని నిర్ణయానికి తగ్గట్టే ఆసీస్ బౌలర్లు ఆరంభంలోనే భారత్‌ను గట్టి దెబ్బతీశారు. కెప్టెన్‌ శుభ్‌మన్ గిల్ (9) కూడా తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరగా... స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (0) ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. దీంతో భార‌త్ 17 ప‌రుగుల‌కే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో రోహిత్ శర్మ జట్టును ఆదుకున్నాడు. అయ్య‌ర్‌తో క‌లిసి కీల‌క‌మైన 118 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పాడు. 

అయితే, ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా భారత మిడిలార్డర్‌ను దెబ్బతీశాడు. అద్భుతంగా ఆడుతున్న శ్రేయస్ అయ్యర్‌ను, దూకుడుగా ఆడుతున్న అక్షర్ పటేల్‌ను జంపానే ఔట్ చేశాడు. వీరిద్దరూ భారీ షాట్లకు ప్రయత్నించి తమ వికెట్లను చేజార్చుకున్నారు. వీరితో పాటు కేఎల్ రాహుల్ (11) వికెట్‌ను కూడా జంపానే పడగొట్టాడు. దీంతో భారత్ భారీ స్కోరు చేసే అవకాశాలను కోల్పోయింది.

చివర్లో నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా కొంతసేపు క్రీజులో నిలిచి జట్టు స్కోరును 250 పరుగులు దాటించారు. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా 4 కీలక వికెట్లు తీసి భారత పరుగుల వేగానికి కళ్లెం వేశాడు. అలాగే జేవియ‌ర్ బార్ట్‌లెట్ 3, మిచెల్ స్టార్క్ 2 వికెట్లు తీశారు. 


More Telugu News