మసూద్ అజార్ సోదరి నాయకత్వంలో మహిళా విభాగాన్ని ప్రారంభించిన జైష్ ఏ మొహమ్మద్

  • జమాత్ ఉల్ మొమినాత్ పేరుతో మహిళా విభాగం ఏర్పాటు
  • తుఫత్ అల్ ముమినాత్ పేరుతో ఆన్‌లైన్ శిక్షణా కోర్సు ప్రారంభం
  • నాయకత్వం వహించనున్న మసూద్ అజార్ సోదరి సాదియా
పాకిస్థాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రవాద సంస్థ జైష్ ఏ మొహమ్మద్ 'జమాత్ ఉల్ మొమినాత్' పేరుతో తన తొలి మహిళా విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది. తాజాగా, జైష్ 'తుఫత్ అల్ ముమినాత్' పేరుతో ఆన్‌లైన్ శిక్షణా కోర్సును కూడా ప్రారంభించినట్లు తెలిపింది. దీని ద్వారా నిధులు సేకరించి, మరింతమంది మహిళలను ఆకర్షించాలని భావిస్తోంది.

ఈ మహిళా బ్రిగేడ్‌కు మసూద్ అజార్ సోదరి సాదియా అజార్ నాయకత్వం వహించనున్నారు. మే నెలలో భారత దళాలు ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా మర్కజ్ సుభానల్లాలోని జైష్ కార్యాలయంపై దాడి చేసినప్పుడు ఆమె భర్త యూసుఫ్ అజార్ మరణించినట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో సంస్థను మరింత బలోపేతం చేయడంలో భాగంగా మరింతమంది మహిళలను నియమించుకోవాలని భావిస్తున్నారు.

సంస్థను బలోపేతం చేయడం కోసం మరింత మంది మహిళలను నియమించుకోవాలని యోచిస్తున్నారు. మసూద్ అజార్, కుటుంబ సభ్యులు, అతని కమాండర్లు జిహాదీ, మతం, ఇస్లాంకు సంబంధించిన అంశాలపై మహిళలకు శిక్షణ ఇస్తారు" అని జైష్ ఏ మహమ్మద్ వర్గాలు తెలిపాయి. మహిళలను ఉగ్రవాదం వైపు మళ్లించేందుకు నవంబర్ 8 నుంచి ఆన్‌లైన్ లైవ్ క్లాస్‌లు ప్రారంభించనున్నారు.

ఈ శిక్షణలో భాగంగా ప్రతిరోజు 40 నిమిషాల పాటు మసూద్ సోదరీమణులు, కమాండర్ల కుటుంబ సభ్యులు మహిళలకు పాఠాలు బోధిస్తారని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఇందుకోసం మహిళా బ్రిగేడ్‌లోని సభ్యుల నుంచి కొంత మొత్తంలో విరాళాలు కూడా సేకరిస్తున్నారు. ఆపరేషన్ సిందూర్ అనంతరం తమ నెట్‌వర్క్‌ను విస్తరించుకోవడానికి జైష్ ఏ మొహమ్మద్ తొలిసారి మహిళా బ్రిగేడ్‌ను ఏర్పాటు చేసింది.


More Telugu News