భారతీయ వైద్య విద్యార్థికి కజకిస్థాన్‌లో బ్రెయిన్ స్ట్రోక్.. ఎయిర్ అంబులెన్స్‌లో జైపూర్ కి తరలింపు

Indian Medical Student Rahul Ghoslya Suffers Brain Stroke in Kazakhstan
  • వెంటిలేటర్‌పై చావుబతుకుల మధ్య పోరాటం
  • ఎయిర్ అంబులెన్స్‌లో జైపూర్‌లోని ఎస్ఎంఎస్ ఆసుపత్రికి తరలింపు
  • తల్లిదండ్రుల విజ్ఞప్తితో స్పందించిన ప్రభుత్వాలు
  • ప్రత్యేక వైద్య బృందంతో పర్యవేక్షణ
కజకిస్థాన్‌లో బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న రాజస్థాన్‌కు చెందిన ఓ వైద్య విద్యార్థిని ఎట్టకేలకు స్వదేశానికి తీసుకొచ్చారు. తీవ్ర అస్వస్థతతో వెంటిలేటర్‌పై ఉన్న అతడిని సోమవారం సాయంత్రం ప్రత్యేక ఎయిర్ అంబులెన్స్‌లో జైపూర్‌కు తరలించారు.

జైపూర్‌లోని షాపురాకు చెందిన రాహుల్ ఘోసల్య (22) అనే యువకుడు 2021 నుంచి కజకిస్థాన్‌లోని అస్తానాలో ఎంబీబీఎస్ చదువుతున్నాడు. ఈ నెల 8న  బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యాడు. దీంతో అక్కడి ఆసుపత్రిలో చేర్పించగా, పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్ మీద ఉంచి చికిత్స అందించారు.

కుమారుడిని మెరుగైన చికిత్స కోసం భారత్‌కు తీసుకురావాలని రాహుల్ తల్లిదండ్రులు సోషల్ మీడియా ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. వారి ఆవేదనకు పలు సామాజిక సంస్థలు కూడా తోడవ్వడంతో ప్రభుత్వాలు స్పందించాయి. తక్షణమే చర్యలు చేపట్టి రాహుల్‌ను స్వదేశానికి తరలించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశాయి.

సోమవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో జైపూర్‌కు చేరుకున్న రాహుల్‌ను, ముందుగా సిద్ధం చేసిన క్రిటికల్ కేర్ అంబులెన్స్‌లో ఎస్ఎంఎస్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలోని మెడికల్ ఐసీయూలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఎస్ఎంఎస్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ దీపక్ మహేశ్వరి నేతృత్వంలోని వైద్య బృందం రాహుల్ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. అతడి సంరక్షణ కోసం నలుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక ప్యానెల్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
Go Back to Shorts
Rahul Ghoslya
Kazakhstan
brain stroke
medical student
Rajasthan
Jaipur
SMS Hospital
Astana
air ambulance
MBBS

More Telugu News