Jagan Mohan Reddy: లండన్ నుంచి బెంగళూరుకు చేరుకున్న జగన్... రేపు తాడేపల్లికి!

వైసీపీ అధినేత జగన్ తన లండన్ పర్యటన ముగించుకుని స్వదేశానికి తిరిగి వచ్చారు. ఈ ఉదయం ఆయన బెంగళూరు చేరుకున్నారని, రేపు తాడేపల్లిలోని తన నివాసానికి వస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

తన పెద్ద కుమార్తెను చూసేందుకు అక్టోబర్ 11న జగన్ లండన్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ పర్యటన కోసం హైదరాబాద్‌లోని సీబీఐ కేసుల ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు అనుమతి మంజూరు చేసింది. అయితే, జగన్‌కు ఇచ్చిన ప్రయాణ అనుమతిని రద్దు చేయాలని కోరుతూ కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. బెయిల్ షరతులను ఉల్లంఘిస్తూ ఆయన తన సొంత ఫోన్ నంబర్‌ను వెల్లడించలేదని సీబీఐ ఆరోపించింది. ఈ పిటిషన్‌పై ఈ వారం చివర్లో విచారణ జరిగే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా, జగన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి, చీకటిపై వెలుగు సాధించిన విజయానికి ప్రతీక అయిన ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, శాంతి, శ్రేయస్సు నింపాలని ఆకాంక్షించారు. ఈ దీపావళి పర్వదినం తెలుగు ప్రజలందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు.

మరోవైపు, జమియత్ ఉలేమా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ మౌలానా హఫీజ్ పీర్ షబ్బీర్ అహ్మద్ మృతి పట్ల జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. మౌలానా షబ్బీర్ అహ్మద్ సమాజ సేవకు తన జీవితాన్ని అంకితం చేశారని, ఆయన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 
Jagan Mohan Reddy
YS Jagan
Jagan London
Jagan Bangalore
Tadepalli
CBI Court
AP Politics
Deepavali wishes
Maulana Shabbir Ahmed death

More Telugu News