ముగిసిన రియాజ్ కథ.. కానిస్టేబుల్ హత్య కేసులో కీలక పరిణామం

  • కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడు రియాజ్
  • ఆదివారం అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ పారిపోయే యత్నం
  • గన్ లాక్కోవడంతో పోలీసుల కాల్పులు
  • ఎన్‌కౌంటర్‌లో రియాజ్ అక్కడికక్కడే మృతి
  • ఆత్మరక్షణ కోసమే కాల్పులన్న పోలీసులు
నిజామాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో ప్రధాన నిందితుడు రియాజ్ ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. ఆసుప‌త్రి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా, పోలీసులు జరిపిన కాల్పుల్లో అతను హతమయ్యాడు. ఆదివారం అరెస్టయిన రియాజ్, సోమవారం ఉదయం ప్రాణాలు కోల్పోవడంతో ఈ కేసు ముగిసినట్లయింది.

వివరాల్లోకి వెళితే... పోలీసుల కథనం ప్రకారం చికిత్స నిమిత్తం ఆసుప‌త్రిలో ఉన్న రియాజ్‌ను సోమవారం ఉదయం ఎక్స్‌రే కోసం తీసుకువెళుతున్నారు. ఈ సమయంలో ఓ కానిస్టేబుల్ వద్ద నుంచి తుపాకీ లాక్కుని, అక్కడి నుంచి పారిపోయేందుకు అతను ప్రయత్నించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు, ఆత్మరక్షణ కోసం అతనిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో రియాజ్ అక్కడికక్కడే మరణించినట్లు అధికారులు వెల్లడించారు.

మూడు రోజుల క్రితం కానిస్టేబుల్ ప్రమోద్‌ను దారుణంగా హత్య చేసిన రియాజ్ కోసం పోలీసులు తీవ్రంగా గాలించారు. ఎట్టకేలకు ఆదివారం సారంగపూర్ అటవీ ప్రాంతంలోని ఓ లారీలో అతను దాక్కున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అతన్ని చుట్టుముట్టారు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు సమీపంలోని కాలువలోకి దూకినప్పటికీ, ఓ యువకుడి సహాయంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో జరిగిన ఘర్షణలో గాయపడటంతో రియాజ్‌ను ఆసుప‌త్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

వాస్తవానికి రియాజ్‌ను అరెస్ట్ చేసినప్పుడే ఎన్‌కౌంటర్ జరిగిందంటూ ప్రచారం జరిగింది. అయితే దీనిని నిజామాబాద్ సీపీ ఖండించారు. అరెస్ట్ సమయంలో సంయమనం పాటించామని, కానీ ఇప్పుడు ఏకంగా ఆయుధంతో దాడికి ప్రయత్నించడంతో కాల్పులు జరపాల్సి వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. కాగా, కొద్దిరోజుల క్రితం రియాజ్‌ను బైక్‌పై పోలీస్ స్టేషన్‌కు తరలిస్తుండగా, అతను తన వద్ద ఉన్న కత్తితో కానిస్టేబుల్ ప్రమోద్‌పై దాడి చేసి పరారైన విషయం తెలిసిందే. చికిత్స పొందుతూ ప్రమోద్ మరణించారు. ఈ ఘటన పోలీసు వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.


More Telugu News