తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితను కలిసిన ఆర్ కృష్ణయ్య

  • రేపటి తెలంగాణ బంద్‌కు మద్దతు కోరిన ఆర్ కృష్ణయ్య
  • సంపూర్ణ మద్దతు ప్రకటించిన కవిత
  • తెలంగాణ జాగృతి బీసీల పక్షపాతి అన్న కవిత
రేపు బీసీ సంఘాలు నిర్వహించనున్న బంద్‌కు మద్దతు తెలపాలని బీసీ సంఘాల జేఏసీ ఛైర్మన్ ఆర్. కృష్ణయ్య, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను కలిసి విజ్ఞప్తి చేశారు. 42 శాతం రిజర్వేషన్ల కోసం బీసీ కులాలు పిలుపునిచ్చిన బంద్‌కు కవిత సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, తెలంగాణ జాగృతి బీసీల పక్షపాతి అని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలను మభ్యపెడుతున్నాయని ఆమె విమర్శించారు. తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఎక్కడికక్కడ బంద్‌లో పాల్గొంటారని హామీ ఇచ్చారు. బీసీ రిజర్వేషన్ల కోసం పార్లమెంటులో చట్టం చేసేంత వరకు తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుందని తెలిపారు.

బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ బద్ధత కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేలా పోరాటం చేద్దామని కవిత పిలుపునిచ్చారు. బీసీ వర్గానికి చెందిన వారు కాకపోయినా బీసీల కోసం కవిత పోరాటం చేయడం అభినందనీయమని ఆర్ కృష్ణయ్య ప్రశంసించారు.


More Telugu News