Amir Khan Muttaqi: తాలిబన్ మంత్రి మీడియా సమావేశం.. భారత మహిళా జర్నలిస్టులపై యూఎస్ కాంగ్రెస్ సభ్యురాలు ప్రశంసలు

US Congresswoman Praises Indian Women Journalists at Taliban Minister Press Meet
షార్ట్స్‌లో చూడండి
మహిళల సమాన హక్కుల కోసం ఎదురొడ్డి నిలిచిన భారత మహిళా జర్నలిస్టులను చూస్తే తనకు ఎంతో సంతోషంగా ఉందని అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు సిడ్నీ కామ్లేజర్ డోవ్ తన సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా పేర్కొన్నారు. ఇటీవల భారత్‌కు వచ్చిన ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి అమిర్‌ఖాన్ ముత్తాఖీ ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో ఉద్దేశపూర్వకంగా మహిళలు పాల్గొనకుండా నిషేధం విధించారని విమర్శలు వచ్చాయి. దీంతో ఆ తర్వాత ఆయనే స్వయంగా తన ప్రెస్‌మీట్‌కు రావాల్సిందిగా మహిళా జర్నలిస్టులను ఆహ్వానించారు. దీనిపై సిడ్నీ కామ్లేజర్ స్పందించారు.

భారత్‌కు చెందిన మహిళా జర్నలిస్టులు తమ సమాన హక్కుల కోసం ధైర్యంగా పోరాడారని ఆమె అన్నారు. నిజాన్ని నిర్భయంగా చాటి చెప్పేందుకు వారు తాలిబన్ నేత ముందు గర్వంగా నిలబడటం చూస్తే సంతోషంగా ఉందని పేర్కొన్నారు. తాలిబన్లు నిర్వహించే కార్యక్రమాలలో ఆఫ్ఘన్ మహిళలపై నిషేధం విధించాడాన్ని అమెరికా ఎప్పుడూ వ్యతిరేకిస్తోందని గుర్తు చేశారు.

ఆప్ఘాన్ విదేశాంగ మంత్రి అమిర్‌ఖాన్ ముత్తాఖీ భారత పర్యటన సందర్భంగా ఢిల్లీలోని ఎంబసీలో మీడియా సమావేశం నిర్వహించగా, ఒక్క మహిళా జర్నలిస్టు కనిపించలేదు. దీంతో మహిళ జర్నలిస్టులు పాల్గొనకుండా అడ్డుకున్నారని వార్తలు వచ్చాయి. ఈ విషయమై కొందరు మహిళా జర్నలిస్టులు సామాజిక మాధ్యమాల్లో విమర్శలు చేశారు. ఈ ఘటనను ఎడిటర్ గిల్డ్ ఆఫ్ ఇండియా, మహిళా జర్నలిస్టులకు సంబంధించిన ఐడబ్ల్యూపీసీ కూడా ఖండించాయి. అయితే తాము ఉద్దేశపూర్వకంగా మహిళలను ప్రెస్ మీట్ నుంచి మినహాయించలేదని, మహిళలపై తమకు ఎలాంటి వివక్ష లేదని తాలిబన్ ప్రకటించింది.
Go Back to Shorts
Amir Khan Muttaqi
Taliban
Indian women journalists
Sydney Kamlager Dove
Afghanistan
India

More Telugu News