బెజవాడ కనకదుర్గమ్మకు రూ.2 కోట్ల ఆభరణాల కానుక

  • కనకదుర్గమ్మకు భారీ విలువైన కానుకను సమర్పించిన కీర్తిలాల్ జ్యూయలరీ నిర్వాహకులు
  • వజ్రాలతో కూడిన బంగారు ఆభరణాలు చైర్మన్, ఈవోలకు అందజేత
  • కార్యక్రమంలో పాల్గొన్న తమిళనాడు గవర్నర్ అర్ధాంగి లక్ష్మీరవి, మాజీ ఎంపీలు
బెజవాడ కనకదుర్గమ్మ అమ్మవారికి కీర్తిలాల్ జ్యూయలరీ నిర్వాహకులు రూ. 2 కోట్ల విలువైన ఆభరణాలను కానుకగా సమర్పించారు. వారు నిన్న రాత్రి వజ్రాలతో కూడిన బంగారు ఆభరణాలను అమ్మవారికి అర్పించారు.

సూర్య చంద్రుల ఆభరణాలు, ముక్కుపుడక, బులాకీ, బొట్టు, సూత్రాలు, గొలుసు, కంఠాభరణాలు వంటి పలు రకాల నూతన ఆభరణాలను ఆలయ ప్రాంగణంలో దేవస్థానం ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఆలయ ఈవో శీనానాయక్‌లకు అందజేశారు. మొత్తం 531 గ్రాముల బంగారం, వజ్రాలతో ఈ ఆభరణాలను తయారు చేసినట్లు జ్యూయలరీ ప్రతినిధులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ అర్ధాంగి లక్ష్మీ రవి, మాజీ ఎంపీలు గోకరాజు గంగరాజు, కనుమూరి బాపిరాజు, కీర్తిలాల్ జ్యూయలరీ డైరెక్టర్ సూరజ్ శాంతకుమార్ దంపతులు తదితరులు పాల్గొన్నారు. దుర్గమ్మ దర్శనార్థం వచ్చిన భక్తులు ఈ సందర్భంగా ఆభరణాలను చూసి ఆనందం వ్యక్తం చేశారు. 


More Telugu News