చంద్రబాబు, పవన్ విజన్ అద్భుతం.. ఏపీకి అండగా ఉంటాం: ప్రధాని మోదీ

  • కర్నూలు జిల్లా నన్నూరులో ప్రధాని మోదీ భారీ బహిరంగ సభ
  • రూ.13,429 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు వర్చువల్ శ్రీకారం
  • డబుల్ ఇంజిన్ సర్కార్‌తో ఏపీలో శరవేగంగా అభివృద్ధి అని వెల్లడి
  • చంద్రబాబు, పవన్ కల్యాణ్ నాయకత్వాన్ని కొనియాడిన ప్రధాని
  • వికసిత్ భారత్’ లక్ష్య సాధనలో ఏపీ కీలక భాగస్వామి అని ప్రశంస
  • రాయలసీమ అభివృద్ధికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని హామీ
ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేయడంతో అభివృద్ధి పరుగులు పెడుతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రూపంలో రాష్ట్రానికి శక్తిమంతమైన నాయకత్వం లభించిందని, ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ పాలనలో గత 16 నెలలుగా ఏపీ అపూర్వ ప్రగతి సాధిస్తోందని ప్రశంసించారు. గురువారం కర్నూలు జిల్లా నన్నూరు వద్ద నిర్వహించిన 'సూపర్ జీఎస్టీ - సూపర్ సేవింగ్స్' భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు.

రూ.13,429 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం
ఈ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన, చేపట్టనున్న రూ.13,429 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు వర్చువల్ విధానంలో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. విద్యుత్, రైల్వే, జాతీయ రహదారులు, రక్షణ రంగాలకు చెందిన ఈ ప్రాజెక్టులు రాష్ట్రంలో కనెక్టివిటీని బలోపేతం చేస్తాయని, పరిశ్రమలకు ఊతమిచ్చి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తాయని ఆయన వివరించారు. ముఖ్యంగా ఈ ప్రాజెక్టుల వల్ల కర్నూలుతో పాటు పరిసర ప్రాంతాలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని తెలిపారు.

చంద్రబాబు, పవన్‌లపై ప్రశంసల వర్షం
రాష్ట్ర నాయకత్వంపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. "ఏపీలో విజన్ ఉన్న చంద్రబాబు, పవన్ కల్యాణ్ లాంటి నేతలు ఉన్నారు. వారికి కేంద్ర ప్రభుత్వ పూర్తి సహకారం కూడా ఉంది. వీరి నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళుతోంది" అని అన్నారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తెలుగులో "సోదర సోదరీమణులకు నమస్కారం" అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీ, అహోబిళం, మహానంది, మంత్రాలయం స్వాముల ఆశీస్సులు కోరుకుంటున్నట్లు తెలిపారు. తన జన్మస్థలమైన గుజరాత్‌లోని సోమనాథుడిని, కాశీ విశ్వనాథుడిని, శ్రీశైలం మల్లికార్జున స్వామిని స్మరించుకున్నారు.

డబుల్ ఇంజిన్ సర్కార్‌తో ప్రగతి పరుగులు
ఢిల్లీ, అమరావతి కలిసి పనిచేస్తుండటంతో అభివృద్ధి వేగంగా సాగుతోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. "గత 16 నెలల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ కారణంగా ఏపీ అనూహ్య ప్రగతి సాధిస్తోంది. 2047 నాటికి మన దేశం వికసిత భారత్‌గా మారాలన్న లక్ష్యంలో ఆంధ్రప్రదేశ్ తన వంతు కీలక సహకారం అందిస్తోంది. 21వ శతాబ్దం 140 కోట్ల భారతీయులది" అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలే ప్రాధాన్యంగా తమ ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయని, అభివృద్ధే తమ విధానమని స్పష్టం చేశారు.

రాయలసీమ అభివృద్ధికి పెద్దపీట
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే రాయలసీమ అభివృద్ధి చాలా ముఖ్యమని ప్రధాని నొక్కిచెప్పారు. ఈ ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పలు ప్రాజెక్టులు చేపడుతున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఓర్వకల్లు, కొప్పర్తిలలో ఏర్పాటు చేస్తున్న పారిశ్రామిక కారిడార్లు రాయలసీమ రూపురేఖలను మారుస్తాయని, ఇక్కడ పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన వివరించారు.

పెట్టుబడులకు స్వర్గధామంగా ఏపీ
ఆంధ్రప్రదేశ్, భారతదేశ అభివృద్ధిని ప్రపంచమంతా గమనిస్తోందని ప్రధాని అన్నారు. గూగుల్ లాంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థ ఏపీలో భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిందని గుర్తుచేశారు. "అమెరికా వెలుపల తమ అతిపెద్ద పెట్టుబడిని ఏపీలో పెడుతున్నట్లు గూగుల్ సీఈఓ స్వయంగా చెప్పారు. విశాఖలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) హబ్, డేటా సెంటర్, సబ్-సీ కేబుల్ వంటి భారీ ప్రాజెక్టులు రాబోతున్నాయి. ఈ సబ్-సీ కేబుల్ వ్యవస్థకు విశాఖ గేట్‌వేగా మారనుంది" అని మోదీ తెలిపారు.

ఇంధన రంగంలో ఏపీ కీలక పాత్ర
దేశ ఇంధన భద్రతలో ఏపీ కీలక పాత్ర పోషిస్తోందని ప్రధాని కొనియాడారు. గతంలో దేశంలో విద్యుత్ సంక్షోభాలు ఉండేవని, ఇప్పుడు తమ ప్రభుత్వం క్లీన్ ఎనర్జీ ఉత్పత్తిలో రికార్డులు సృష్టిస్తోందని అన్నారు. దేశంలో తలసరి విద్యుత్ వినియోగం 1400 యూనిట్లకు పెరిగిందని, ప్రతి ఇంటికి, పరిశ్రమకు సరిపడా విద్యుత్ అందుబాటులో ఉందని చెప్పారు. చిత్తూరు ఎల్‌పీజీ బాట్లింగ్ ప్లాంట్ రోజుకు 20 వేల సిలిండర్లు నింపే సామర్థ్యంతో పనిచేస్తోందని, సహజవాయువు పైప్‌లైన్‌తో 15 లక్షల ఇళ్లకు గ్యాస్ సరఫరా అవుతుందని వివరించారు.


More Telugu News