Narendra Modi: మా ప్రయోజనాలే ముఖ్యం: రష్యా చమురుపై ట్రంప్ వ్యాఖ్యలకు భారత్ కౌంటర్

India clarifies stance on Russia oil purchases after Trump claim
షార్ట్స్‌లో చూడండి
రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లను నిలిపివేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ తనకు హామీ ఇచ్చారంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం స్పందించింది. దేశ ఇంధన భద్రత, వినియోగదారుల ప్రయోజనాలే తమకు అత్యంత ప్రాధాన్యమని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఇంధన దిగుమతుల విషయంలో తమ విధానాలు పూర్తిగా దేశీయ అవసరాల మేరకే ఉంటాయని పేర్కొంది.

ఎన్డీటీవీ కథనం ప్రకారం, "రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ ఆపేస్తుందని ప్రధాని మోదీ నాకు హామీ ఇచ్చారు. ఇది వెంటనే జరగకపోయినా, ఆ ప్రక్రియ త్వరలోనే ముగుస్తుంది" అని ట్రంప్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశం కావడంతో భారత విదేశాంగ శాఖ దీనిపై అధికారికంగా స్పందించింది.

విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఒక ప్రకటన విడుదల చేస్తూ, "భారత్ భారీ మొత్తంలో చమురు, గ్యాస్ దిగుమతి చేసుకుంటుంది. అంతర్జాతీయంగా ఇంధన ధరల్లో ఒడిదొడుకులు నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో భారతీయ వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటమే మా ప్రథమ ప్రాధాన్యత. మా దిగుమతి విధానాలు పూర్తిగా ఈ లక్ష్యం ఆధారంగానే ఉంటాయి" అని వివరించారు.

"స్థిరమైన ఇంధన ధరలు, సరఫరాల భద్రత అనేవి మా ఇంధన విధానంలోని రెండు ప్రధాన లక్ష్యాలు. దీనికోసం మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఇంధన వనరులను విస్తృతం చేసుకుంటున్నాం" అని ఆయన తెలిపారు. ఇక అమెరికా విషయానికొస్తే, చాలా ఏళ్లుగా ఆ దేశం నుంచి ఇంధన సేకరణను పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని, గత దశాబ్ద కాలంలో ఇది క్రమంగా పెరిగిందని ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుత అమెరికా ప్రభుత్వం కూడా భారత్‌తో ఇంధన సహకారాన్ని పెంపొందించుకోవడంపై ఆసక్తి చూపుతోందని, ఈ విషయంపై చర్చలు కొనసాగుతున్నాయని ఆయన వెల్లడించారు.
Go Back to Shorts
Narendra Modi
India Russia oil
India oil imports
Donald Trump
Indian foreign policy
Russia oil supply
India energy security
Randhir Jaiswal
India US relations

More Telugu News