హ్యుందాయ్ ఇండియాలో కొత్త చరిత్ర... తొలిసారిగా ఎండీగా భారతీయుడు

  • హ్యుందాయ్ మోటార్ ఇండియాకు కొత్త ఎండీ, సీఈఓగా తరుణ్ గార్గ్
  • 2026 జనవరి 1 నుంచి బాధ్యతల స్వీకరణ
  • కంపెనీ చరిత్రలో ఈ పదవి చేపట్టనున్న తొలి భారతీయుడు
  • ప్రస్తుత ఎండీ ఉన్సూ కిమ్‌కు మాతృసంస్థలో కీలక బాధ్యతలు
  • ఆటోమొబైల్ రంగంలో తరుణ్ గార్గ్‌కు మూడు దశాబ్దాల అనుభవం
  • భారత్‌లో కార్యకలాపాలు బలోపేతం చేసే వ్యూహంలో భాగమే ఈ నియామకం
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎంఐఎల్) తన నాయకత్వంలో కీలక మార్పును ప్రకటించింది. కంపెనీ చరిత్రలోనే తొలిసారిగా ఒక భారతీయుడికి మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ), చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) బాధ్యతలను అప్పగించింది. ప్రస్తుతం చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ)గా పనిచేస్తున్న తరుణ్ గార్గ్‌ను ఈ ఉన్నత పదవికి నియమించినట్లు బుధవారం వెల్లడించింది.

తరుణ్ గార్గ్ నియామకం 2026 జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. ప్రస్తుత ఎండీ ఉన్సూ కిమ్ 2025 డిసెంబర్ 31న తన బాధ్యతల నుంచి వైదొలగనున్నారు. ఆయన దక్షిణ కొరియాలోని హ్యుందాయ్ మాతృసంస్థలో వ్యూహాత్మక బాధ్యతలు చేపట్టనున్నారు. అప్పటి వరకు తరుణ్ గార్గ్ ‘ఎండీ & సీఈఓ డెసిగ్నేట్’ హోదాలో కొనసాగుతారని కంపెనీ బీఎస్ఈకి సమర్పించిన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. ఈ సందర్భంగా ఉన్సూ కిమ్ కంపెనీకి అందించిన విలువైన సేవలను డైరెక్టర్ల బోర్డు ప్రశంసించింది.

ఆటో రంగంలో అపార అనుభవం
ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్, ఐఐఎం లక్నో నుంచి ఎంబీఏ పూర్తి చేసిన తరుణ్ గర్గ్‌కు ఆటోమొబైల్ రంగంలో మూడు దశాబ్దాలకు పైగా అపార అనుభవం ఉంది. హ్యుందాయ్‌లో చేరకముందు ఆయన మారుతి సుజుకీ ఇండియాలో మార్కెటింగ్, లాజిస్టిక్స్ వంటి పలు కీలక విభాగాల్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేశారు.

హ్యుందాయ్‌లో చేరాక మార్కెట్ వాటాను విస్తరించడంలో, లాభదాయకతను పెంచడంలో గర్గ్ కీలక పాత్ర పోషించారు. డిజిటల్ మార్కెటింగ్, గ్రామీణ ప్రాంతాలకు విస్తరణ, యూజ్డ్ కార్ల విభాగంలో కొత్త కార్యక్రమాలకు ఆయన నాయకత్వం వహించారు. అంతేకాకుండా, భారత్‌లో హ్యుందాయ్ అందిస్తున్న 9 మోడళ్లలో అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (అడాస్) ఫీచర్‌ను ప్రవేశపెట్టడంలోనూ ఆయన కృషి ఉంది.

భారతదేశంలో కంపెనీ పునాదులను బలోపేతం చేసి, స్మార్ట్ మొబిలిటీ సొల్యూషన్స్ ప్రొవైడర్‌గా మారాలన్న దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగానే ఈ నియామకం చేపట్టినట్లు హ్యుందాయ్ ఓ ప్రకటనలో తెలిపింది. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) గణాంకాల ప్రకారం, ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య హ్యుందాయ్ దేశీయ మార్కెట్లో 2,20,233 యూనిట్లను విక్రయించింది. గతేడాదితో పోలిస్తే ఇది 11.2 శాతం తక్కువ.


More Telugu News