తిరుమల పరకామణి కేసు... ఫైళ్లను స్వాధీనం చేసుకున్న సీఐడీ

  • తిరుమల శ్రీవారి ఆలయ పరకామణి చోరీ కేసులో రికార్డులను సీజ్ చేసిన ఏపీ సీఐడీ అధికారులు
  • సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ ఆధ్వర్యంలో విచారణ జరిపిన వైనం
  • త్వరలో సీజ్ చేసిన రికార్డులను హైకోర్టుకు అందజేస్తామన్న సీఐడీ డీజీ అయ్యన్నార్
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలోని పరకామణి చోరీ కేసులో విచారణ జరిపిన ఏపీ సీఐడీ అధికారులు, కేసుకు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ విచారణ చేపట్టిన విషయం విదితమే. తిరుమల పరకామణిని సందర్శించిన అనంతరం సీఐడీ బృందం తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు చేరుకుని కేసుకు సంబంధించిన రికార్డులను సేకరించారు. స్వాధీనం చేసుకున్న రికార్డులను త్వరలో హైకోర్టుకు అప్పగిస్తామని సీఐడీ డీజీ అయ్యన్నార్ తెలిపారు.

2023 మార్చిలో తిరుమల పరకామణిలో 920 అమెరికన్ డాలర్లు చోరీకి గురైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో టీటీడీ ఉద్యోగి రవికుమార్ ప్రధాన నిందితుడిగా అరెస్ట్‌ అయ్యాడు. అయితే, ఈ ఘటనపై టీటీడీ పూర్తిస్థాయి విచారణ జరపలేదని ఆరోపణలు వచ్చాయి. అనంతరం, లోక్‌ అదాలత్‌ ద్వారా రాజీ కుదుర్చుకొని కేసును మూసివేశారనే ఆరోపణలతో హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు, పోలీసుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, నిజానిజాలు వెలికి తీయాలని ఆదేశించింది.

దీంతో సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం నిన్న విచారణ జరిపింది. 


More Telugu News