Nara Lokesh: విశాఖకు పదేళ్ల సమయం చాలు: మంత్రి నారా లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధాని అమరావతి కాగా, రాష్ట్రాభివృద్ధిలో కీలకమైన ఆర్థిక రాజధానిగా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దనున్నట్లు ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. 2047 నాటికి విశాఖను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన ప్రకటించారు. విశాఖలో ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్, ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్‌కు శంకుస్థాపన చేసిన అనంతరం రిషికొండలో జరిగిన కార్యక్రమంలో లోకేశ్ ప్రసంగించారు.

"ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణే మా విధానం. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు మా విధానానికే పట్టం కట్టారు. సమర్థ పాలన, ఉద్యోగాల కల్పన, విశాఖను ఆర్థిక రాజధానిగా చేయడం కోసమే 94 శాతం సీట్లతో మమ్మల్ని గెలిపించారు" అని లోకేశ్ అన్నారు. హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందడానికి 30 ఏళ్లకు పైగా సమయం పడితే, విశాఖను అభివృద్ధి చేయడానికి పదేళ్ల సమయం చాలని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇది తమ ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని తెలిపారు.

భారత్‌లోనే అతిపెద్ద విదేశీ పెట్టుబడి విశాఖకు
విశాఖ అభివృద్ధి కోసం ప్రభుత్వం చేస్తున్న కృషిని లోకేశ్ వివరించారు. "గత 17 నెలల్లో రాష్ట్రానికి వచ్చిన 120 బిలియన్ డాలర్ల పెట్టుబడుల్లో 50 శాతానికి పైగా గ్రేటర్ విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్‌కే వచ్చాయి. దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్, భారత చరిత్రలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్‌డీఐ) కూడా విశాఖపట్నానికే రాబోతోంది" అని ఆయన కీలక ప్రకటన చేశారు. ఈ పెట్టుబడుల ద్వారా విశాఖలో శక్తివంతమైన పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థ అభివృద్ధి చెందుతుందని అన్నారు. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల ఉద్యోగాలు, అందులో కేవలం విశాఖలోనే 5 లక్షల ఐటీ ఉద్యోగాలు కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని పునరుద్ఘాటించారు.

డబుల్ ఇంజన్ సర్కార్‌తో అభివృద్ధి పరుగులు
కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే కూటమి అధికారంలో ఉండటం వల్ల అభివృద్ధి బుల్లెట్ రైలు వేగంతో దూసుకెళుతోందని లోకేశ్ అభివర్ణించారు. "డబుల్ ఇంజన్ సర్కార్ వల్లే విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకోగలిగాం. కేంద్రం రూ.11 వేల కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.3 వేల కోట్లు అందించి ప్లాంట్‌ను ఆదుకున్నాయి. ప్రస్తుతం మూడు ఫర్నేస్‌లు పనిచేస్తున్నాయి. త్వరలోనే వంద శాతం సామర్థ్యంతో నడిపి లాభాల బాట పట్టిస్తాం" అని ఆయన వివరించారు. రైల్వే జోన్ సాధించామని, స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకున్నామని గుర్తుచేశారు.

ఈ పెట్టుబడులు తీసుకురావడం వెనుక ఎనిమిదేళ్ల కృషి ఉందని లోకేశ్ తెలిపారు. సిఫీ ఛైర్మన్ రాజు వేగేశ్నను 2017లో కాలిఫోర్నియాలో కలిసినప్పటి నుంచి ఈ ప్రయాణం మొదలైందని గుర్తు చేసుకున్నారు. ఈ ప్రాజెక్ట్ విశాఖకు రావడంలో మంతెన రామరాజు, ఎన్నారై టీడీపీ నేత సాగర్ దొడ్డపనేని, ఐఏఎస్ అధికారి కాటంనేని భాస్కర్ వంటి వారు కీలక పాత్ర పోషించారని అభినందించారు. రాబోయే మూడు నెలల్లో మరిన్ని పెట్టుబడులు విశాఖకు తరలివస్తాయని, ఏ ఒక్క పెట్టుబడి కూడా పొరుగు రాష్ట్రాలకు వెళ్లకుండా చూస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Nara Lokesh
Visakhapatnam
Andhra Pradesh
AP capital
Vizag economy
AP jobs
AP investments
Steel plant
Raju Vegesna
Mantena Ramaraju

More Telugu News