రైల్వే ప్రయాణికులకు గమనిక.. నేటి నుంచి వారం రోజుల పాటు 32 రైళ్ల రద్దు

డోర్నకల్-పాపటపల్లి మార్గంలో మూడో రైల్వే లైన్ మరమ్మతు పనుల కారణంగా పలు రైళ్ల రాకపోకలపై ప్రభావం పడనుంది. ఈ నేపథ్యంలో వారం రోజుల పాటు ఏకంగా 32 రైళ్లను రద్దు చేస్తున్నట్లు, మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేయడంతో పాటు రీషెడ్యూల్ చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ మార్పులు నేటి నుంచి 18వ తేదీ వరకు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు.

రద్దయిన రైళ్ల జాబితాలో పలు కీలక సర్వీసులు ఉన్నాయి. విశాఖపట్నం-న్యూఢిల్లీ ఏపీ ఎక్స్‌ప్రెస్, స్వర్ణజయంతి ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-గుంటూరు ఇంటర్‌సిటీ, పూరి-ఓకా ద్వారకా ఎక్స్‌ప్రెస్‌తో పాటు డోర్నకల్-కాజీపేట, విజయవాడ-డోర్నకల్ మధ్య నడిచే మెమో ప్యాసింజర్ రైళ్లు కూడా ఉన్నాయి.

రైళ్ల రద్దుతో పాటు కొన్ని ప్రధాన రైళ్లను అధికారులు రీషెడ్యూల్ చేశారు. ఆదిలాబాద్-తిరుపతి కృష్ణా ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 13, 16, 17 తేదీల్లో గంటన్నర ఆలస్యంగా బయలుదేరనుంది. అదేవిధంగా, విశాఖపట్నం-సికింద్రాబాద్ మధ్య నడిచే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ సర్వీసులు 15, 16, 18 తేదీల్లో గంటన్నర ఆలస్యంగా ప్రయాణిస్తాయని తెలిపారు. సికింద్రాబాద్-గుంటూరు గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ను ఈ నెల 14 నుంచి 18 వరకు కాజీపేట-గుంటూరు మధ్య పాక్షికంగా రద్దు చేశారు. ఈ రైలు కేవలం సికింద్రాబాద్-కాజీపేట మధ్య మాత్రమే నడుస్తుందని అధికారులు స్పష్టం చేశారు.

శబరి ఎక్స్‌ప్రెస్‌లో కోచ్ మార్పు
సికింద్రాబాద్ నుంచి త్రివేండ్రం వెళ్లే శబరి ఎక్స్‌ప్రెస్ (20629)లో కోచ్ మార్పు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. నేడు బయలుదేరనున్న ఈ రైలులోని ఫస్ట్ ఏసీ కోచ్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో, దాని స్థానంలో అదనంగా ఒక సెకండ్ ఏసీ కోచ్‌ను ఏర్పాటు చేసినట్లు వివరించారు.

Indian Railways
Train cancellations
SCR
South Central Railway
Dornakal
Kazipet
Vijayawada
Visakhapatnam
Vande Bharat Express
Sabari Express

More Telugu News