Narendra Modi: భారత్-యూకే సహజ భాగస్వాములు: ప్రధాని మోదీ

Narendra Modi says India UK natural partners
షార్ట్స్‌లో చూడండి
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి పరిస్థితుల్లో భారత్, యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) మధ్య భాగస్వామ్యం ప్రపంచ స్థిరత్వానికి, ఆర్థిక ప్రగతికి ఒక ముఖ్యమైన స్తంభంలా నిలుస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. యూకే ప్రధాని కీర్ స్టార్మర్‌తో గురువారం రాజ్‌భవన్‌లో జరిగిన భేటీ అనంతరం ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య రక్షణ, విద్య, వాణిజ్యం వంటి కీలక రంగాల్లో సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

రక్షణ రంగంలో ఇరు దేశాలు ఒక చరిత్రాత్మక ఒప్పందానికి వచ్చాయి. ఈ ఒప్పందం ప్రకారం, భారత వాయుసేనకు చెందిన ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్లు యూకేలోని రాయల్ ఎయిర్‌ఫోర్స్‌లో శిక్షకులుగా పనిచేయనున్నారు. ఇది ఇరు దేశాల సైనిక సహకారంలో ఒక కొత్త అధ్యాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. అదేవిధంగా, విద్యారంగంలోనూ భారీ ముందడుగు పడింది. యూకేకు చెందిన తొమ్మిది ప్రముఖ విశ్వవిద్యాలయాలు తమ క్యాంపస్‌లను భారత్‌లో ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చాయి. ఇటీవలే సౌతాంప్టన్ యూనివర్సిటీ గురుగ్రామ్‌లో తన క్యాంపస్‌ను ప్రారంభించిందని, తొలి బ్యాచ్ విద్యార్థులు ప్రవేశాలు కూడా పొందారని ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు.

అంతర్జాతీయ అంశాలపై కూడా ఇరువురు నేతలు విస్తృతంగా చర్చించారు. ఉక్రెయిన్, గాజాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలపై చర్చలు, దౌత్య మార్గాల ద్వారా శాంతిని పునరుద్ధరించే ప్రయత్నాలకు భారత్ పూర్తి మద్దతు ఇస్తుందని మోదీ పునరుద్ఘాటించారు. ఇండో-పసిఫిక్, పశ్చిమాసియాలో శాంతి, స్థిరత్వం, సముద్ర భద్రతలో సహకారాన్ని పెంచుకోవాలని ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయని తెలిపారు.

ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, చట్టబద్ధమైన పాలన వంటి ఉమ్మడి విలువలపై ఇరు దేశాల సంబంధాలు ఆధారపడి ఉన్నాయని మోదీ అన్నారు. యూకేలో స్థిరపడిన 18 లక్షల మంది ప్రవాస భారతీయులు ఇరు దేశాల మధ్య సజీవ వారధిగా నిలుస్తున్నారని, వారి సహకారంతోనే మన స్నేహం మరింత బలపడిందని కొనియాడారు. సాంకేతికత, ప్రతిభ ఆధారంగా మన భాగస్వామ్యం విశ్వసనీయంగా ముందుకు సాగుతోందని ఆయన పేర్కొన్నారు. కొద్ది నెలల క్రితం కుదిరిన సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం (సెటా) తర్వాత యూకే ప్రధాని భారీ వ్యాపార ప్రతినిధి బృందంతో భారత్‌కు రావడం.. ఇరు దేశాల మధ్య ఏర్పడిన కొత్త ఉత్తేజానికి నిదర్శనమని ప్రధాని మోదీ అభివర్ణించారు.
Go Back to Shorts
Narendra Modi
India UK relations
Keir Starmer
India UK trade
Indian diaspora UK
Royal Air Force
Ukraine war
Gaza conflict
Indo Pacific
Southampton University

More Telugu News