బ్రిడ్జి నిర్మించారు సరే.. అసలు రోడ్డేది?.. బీహార్ లో అధికారుల నిర్వాకం
- బ్రిడ్జిని నిర్మించి అప్రోచ్ రోడ్ విషయం పట్టించుకోని వైనం
- ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన పథకంలో బ్రిడ్జి నిర్మాణం
- రూ. 6 కోట్లు వెచ్చించిన అధికారులు.. బ్రిడ్జికి అవతలివైపు రోడ్డు లేక నిరుపయోగం
ఇవతలివైపు రోడ్డు ఉన్నా బ్రిడ్జి దాటాకా అన్నీ పంటపొలాలే ఉండడంతో బ్రిడ్జి నిర్మించి ఉపయోగం లేకుండా పోయింది. ఖతిహార్ జిల్లా దండ్కోడా బ్లాక్ లో నిర్మించిన ఈ బ్రిడ్జి అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. బ్రిడ్జి నిర్మాణానికి అనుమతిచ్చిన అధికారులు.. అవతలివైపు భూసేకరణ చేసి రోడ్డు నిర్మించేందుకు ప్రయత్నించకపోవడం విమర్శలకు దారితీసింది.
నాలుగేళ్ల క్రితం ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు మొదలు పెట్టిన తర్వాతైనా అప్రోచ్ రోడ్డు నిర్మాణం కోసం అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. అప్రోచ్ రోడ్డు నిర్మిస్తే 12 గ్రామాలకు చెందిన ప్రజలు జిల్లా కేంద్రానికి సులభంగా చేరుకోవడానికి వీలుంటుందని చెబుతున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి అప్రోచ్ రోడ్డు నిర్మించాలని కోరుతున్నారు.