డిప్రెషన్ చికిత్సలో కీలక ముందడుగు.. స్త్రీ, పురుషుల్లో వేర్వేరు కారణాలు

  • పురుషులు, మహిళల్లో డిప్రెషన్‌పై ఆస్ట్రేలియా పరిశోధకుల కీలక అధ్యయనం
  • పురుషులతో పోలిస్తే మహిళల్లోనే జన్యుపరమైన ముప్పు రెట్టింపు
  • మహిళల డీఎన్ఏలో డిప్రెషన్‌కు కారణమయ్యే అదనపు జన్యు మార్పుల గుర్తింపు
  • లింగ భేదం ఆధారంగా కొత్త చికిత్సలు రూపొందించేందుకు మార్గం సుగమం
పురుషులతో పోలిస్తే మహిళల్లో డిప్రెషన్ (కుంగుబాటు) ఎందుకు ఎక్కువగా కనిపిస్తుందనే ప్రశ్నకు శాస్త్రవేత్తలు కీలక సమాధానం కనుగొన్నారు. దీని వెనుక బలమైన జన్యుపరమైన కారణాలు ఉన్నాయని ఆస్ట్రేలియా పరిశోధకులు తమ తాజా అధ్యయనంలో తేల్చారు. ఈ ఆవిష్కరణ భవిష్యత్తులో డిప్రెషన్ చికిత్స విధానంలో విప్లవాత్మక మార్పులకు దారితీయవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

క్యూఐఎంఆర్ బెర్గోఫర్ మెడికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే అతిపెద్ద అధ్యయనాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా లక్షలాది మంది డీఎన్ఏను విశ్లేషించారు. పురుషులతో పోలిస్తే మహిళల డీఎన్ఏలో డిప్రెషన్‌కు కారణమయ్యే జన్యుపరమైన సూచికలు (జెనెటిక్ ఫ్లాగ్స్) దాదాపు రెట్టింపు సంఖ్యలో ఉన్నాయని ఈ బృందం గుర్తించింది.

ఈ పరిశోధన వివరాలను సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ బ్రిటనీ మిచెల్ వెల్లడించారు. "సాధారణంగా మహిళలు తమ జీవితకాలంలో పురుషుల కన్నా రెండు రెట్లు ఎక్కువగా డిప్రెషన్‌కు గురవుతారని మాకు తెలుసు. అయితే దీనికి గల కచ్చితమైన కారణాలపై ఇప్పటివరకు స్పష్టత లేదు. మా అధ్యయనంలో స్త్రీ, పురుషులిద్దరిలో డిప్రెషన్‌కు కారణమయ్యే సుమారు 7,000 జన్యు మార్పులను గుర్తించాం. వీటికి అదనంగా, కేవలం మహిళల్లో మాత్రమే డిప్రెషన్‌కు దారితీసే మరో 6,000 జన్యు మార్పులను కనుగొన్నాం" అని ఆమె తెలిపారు.

మరో పరిశోధకురాలు డాక్టర్ జోడి థామస్ మాట్లాడుతూ, మహిళల్లో డిప్రెషన్ లక్షణాలు భిన్నంగా ఉండటానికి కూడా ఈ జన్యువులే కారణమని వివరించారు. "మహిళల్లో డిప్రెషన్‌కు సంబంధించిన జన్యువులు, వారి శరీరంలోని జీవక్రియలకు (బరువు పెరగడం లేదా తగ్గడం, నీరసం వంటివి) సంబంధించిన జన్యువులతో ముడిపడి ఉన్నట్టు మేము గమనించాం. అందుకే డిప్రెషన్‌తో బాధపడే మహిళల్లో ఇలాంటి శారీరక లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి" అని ఆమె పేర్కొన్నారు.

ఈ పరిశోధన ఫలితాలు ‘నేచర్ కమ్యూనికేషన్స్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. స్త్రీ, పురుషుల్లో డిప్రెషన్‌కు గల జన్యుపరమైన తేడాలను అర్థం చేసుకోవడం ద్వారా, ఒక్కొక్కరికీ సరిపోయే ప్రత్యేకమైన చికిత్సలను అందించేందుకు ఈ అధ్యయనం మార్గం సుగమం చేస్తుందని పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేశారు.


More Telugu News