పాకిస్థాన్‌లో బలోచిస్థాన్ వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్‌పై మరోసారి దాడి... ఐఈడీతో పేల్చివేసిన తిరుగుబాటుదారులు

  • క్వెట్టా వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్‌పై బాంబు దాడి
  • బలోచిస్థాన్ ప్రావిన్స్‌లో పట్టాలు తప్పిన ఆరు రైలు బోగీలు
  • రైల్వే ట్రాక్‌పై ఐఈడీ అమర్చి పేల్చివేసిన వైనం
  • దాడికి తామే బాధ్యులమన్న బలోచ్ రెబల్ గ్రూప్
  • పాక్ సైనికులు ప్రయాణిస్తున్నందుకే లక్ష్యంగా చేసుకున్నామన్న తిరుగుబాటుదారులు
పాకిస్థాన్‌లో ప్యాసింజర్ రైలు లక్ష్యంగా ఉగ్రవాదులు మరోసారి పంజా విసిరారు. బలోచిస్థాన్ ప్రావిన్స్‌లో జాఫర్ ఎక్స్‌ప్రెస్‌పై ఈరోజు జరిగిన శక్తిమంతమైన బాంబు దాడిలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. ఈ పేలుడు ధాటికి రైలుకు చెందిన ఆరు బోగీలు పట్టాలు తప్పాయి. సింధ్-బలోచిస్థాన్ సరిహద్దుకు సమీపంలోని సుల్తాన్‌కోట్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే, క్వెట్టా నగరానికి వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు మార్గంలో తిరుగుబాటుదారులు ముందుగానే అమర్చిన శక్తిమంతమైన ఐఈడీ (ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్)ని పేల్చివేశారు. దీంతో రైలు బోగీలు చెల్లాచెదురై పట్టాలు తప్పాయి. ఈ ఘటన జరిగిన వెంటనే సహాయక బృందాలు, భద్రతా దళాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టంపై అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఇదిలా ఉండగా, ఈ దాడికి తామే బాధ్యత వహిస్తున్నట్లు బలోచ్ రెబల్ గ్రూప్ అయిన బలోచ్ రిపబ్లిక్ గార్డ్స్ (బీఆర్జీ) ప్రకటించింది. పాకిస్థాన్ సైన్యానికి చెందిన సిబ్బంది ఆ రైలులో ప్రయాణిస్తున్నందువల్లే లక్ష్యంగా చేసుకుని ఈ దాడికి పాల్పడినట్లు తమ ప్రకటనలో స్పష్టం చేసింది. "మా దాడిలో పలువురు సైనికులు మరణించారు, మరికొందరు గాయపడ్డారు. బలోచిస్థాన్ స్వాతంత్ర్యం సిద్ధించే వరకు ఇలాంటి దాడులు కొనసాగిస్తాం" అని ఆ సంస్థ హెచ్చరించింది. ఈ ఏడాది మార్చి నుంచి జాఫర్ ఎక్స్‌ప్రెస్‌పై దాడులు జరగడం ఇది మూడోసారి కావడం గమనార్హం. 


More Telugu News