పైలట్ సీట్ లో ఎంపీ.. ప్యాసింజర్ సీట్ లో కేంద్ర మంత్రి

  • బీహార్ లో శివరాజ్ సింగ్ చౌహాన్ కు వింత అనుభవం
  • విమానం నడిపిన బీజేపీ ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీ
  • మర్చిపోలేని అనుభవమంటూ ఫొటోలు ట్వీట్ చేసిన చౌహాన్
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు తాజాగా ఓ వింత అనుభవం ఎదురైంది. బీహార్ లోని పాట్నా నుంచి ఢిల్లీకి వెళ్లేందుకు ఆయన విమానం ఎక్కగా.. కో పైలట్ సీట్ లో బీజేపీ ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీ కనిపించారు. దీంతో ఆశ్చర్యపోయిన చౌహాన్.. రూడీకి కమర్షియల్ పైలట్ లైసెన్స్ ఉందని తెలిసి అభినందించారు. రాజకీయాల్లో బిజీబిజీగా గడుపుతూనే రూడీ తన అభిరుచిని కొనసాగిస్తున్న తీరు ప్రశంసనీయమని అన్నారు. ఇది మర్చిపోలేని అనుభూతి అంటూ చౌహాన్ ఎక్స్ లో ఫొటోలు పంచుకున్నారు.

"ఈ ప్రయాణం నాకు మర్చిపోలేనిది. ఈ విమానానికి నా మిత్రుడు, ఛప్రా ఎంపీ రాజీవ్‌ ప్రతాప్‌ రూడీ కో-పైలట్‌గా విధులు నిర్వర్తించారు" అని చౌహాన్ క్యాప్షన్ జతచేశారు. అంతేకాకుండా, ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీని ప్రశంసిస్తూ కేంద్ర మంత్రి ఓ లేఖ కూడా రాశారు. రూడీ లాంటి వ్యక్తులు చాలా అరుదని అన్నారు.

ఎయిర్‌బస్ ఏ320 నడపగల ఏకైక పార్లమెంటేరియన్‌..
బీహార్‌ నుంచి నాలుగుసార్లు ఎంపీగా గెలిచిన రాజీవ్ ప్రతాప్ రూడీ.. ఎయిర్‌బస్ ఏ320 నడపగల ఏకైక పార్లమెంటేరియన్‌గా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాందించారు. ఆయనకు కమర్షియల్ పైలట్ లైసెన్స్ ఉంది. ఈ లైసెన్స్ మెయింటెయిన్ చేయడానికి అప్పడప్పుడు ఇండిగో ఎయిర్‌లైన్స్‌ విమానాలు నడుపుతుంటారు. 2003 నుంచి 2004 వరకు విమానయాన శాఖ మంత్రిగా కూడా రూడీ సేవలందించారు.


More Telugu News