పరిటాల సునీతపై తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
- రాప్తాడులో 'పరిటాల ట్యాక్స్'తో ప్రజలు బెంబేలెత్తుతున్నారన్న తోపుదుర్తి
- ప్రభుత్వ ఇళ్ల నిర్మాణంలో కమీషన్లు వసూలు చేస్తున్నారని ఆరోపణ
- ప్రశ్నించిన వారికి చెప్పు తెగుద్ది అనడంపై తీవ్ర ఆగ్రహం
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఇళ్ల నిర్మాణంలో భారీ కుంభకోణం జరుగుతోందని తోపుదుర్తి ఆరోపించారు. టీడీపీ కూటమి ఎమ్మెల్యేలు ఒక్కో ఇంటి నిర్మాణానికి లబ్ధిదారుల నుంచి రూ. 10 వేల చొప్పున కమీషన్ దండుకుంటున్నారని విమర్శించారు. ఈ అవినీతిపై విచారణ జరిపే దమ్ము, ధైర్యం ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లకు ఉందా? అని ఆయన సవాల్ విసిరారు.
పరిటాల సునీత, ఆమె కుమారుడు, ధర్మవరం టీడీపీ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డగోలుగా దోచుకుంటున్నారని తోపుదుర్తి ఆరోపించారు. వారి కుటుంబానికి వేల కోట్ల అక్రమాస్తులు ఉన్నాయని, పండగ నాడు ఎనిమిది కార్లకు, గన్లకు ఆయుధ పూజలు చేయడం ప్రజలను దోచుకున్న సొమ్ముతో కాదా? అని ప్రశ్నించారు. ధర్మవరం చేనేత వ్యాపారులను బెదిరించి కోట్లాది రూపాయలు వసూలు చేశారని కూడా ఆయన ఆరోపణలు చేశారు.
ప్రభుత్వ హామీల అమలు గురించి ప్రశ్నించిన వారికి 'చెప్పు తెగుద్ది' అంటూ పరిటాల సునీత బెదిరింపులకు దిగుతున్నారని ఆయన మండిపడ్డారు. ప్రతిపక్ష నేతగా ఇళ్ల నిర్మాణం ఎందుకు ఆగిపోయిందని అడిగితే ఇలాంటి సమాధానాలు ఇస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు తిరగబడితే ఎవరి చెప్పులైనా తెగుతాయని సునీత గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.