Aadhar Update Charges: ఆధార్ సేవలు ఇకపై భారం.. భారీగా పెరిగిన అప్‌డేట్ ఛార్జీలు!

UIDAI Hikes Aadhar Update Charges Significantly
షార్ట్స్‌లో చూడండి
ఆధార్ కార్డు ఉన్నవారికి ఇది ముఖ్యమైన గమనిక. ఆధార్ కార్డులోని వివరాలను మార్చుకోవడానికి (అప్‌డేట్) అయ్యే ఖర్చు ఇప్పుడు మరింత పెరిగింది. డెమోగ్రాఫిక్, బయోమెట్రిక్ మార్పులకు సంబంధించిన సేవల ఛార్జీలను పెంచుతూ యూఐడీఏఐ నిర్ణయం తీసుకుంది. దాదాపు ఐదేళ్ల తర్వాత ఆధార్ సేవల ఛార్జీలను సవరించడం ఇదే తొలిసారి.

తాజా మార్పుల ప్రకారం, ఆధార్ కార్డులో పేరు, చిరునామా, పుట్టిన తేదీ వంటి వివరాలను మార్చుకోవడానికి ఇప్పటివరకు రూ. 50 ఉండగా, దానిని ఇప్పుడు రూ. 75కి పెంచారు. అలాగే, వేలిముద్రలు, కనుపాప వంటి బయోమెట్రిక్ వివరాల అప్‌డేట్ కోసం వసూలు చేసే ఛార్జీని రూ. 100 నుంచి రూ. 125కి పెంచారు. ఈ కొత్త ఛార్జీలు 2028 సెప్టెంబర్ 30 వరకు అమలులో ఉంటాయని, ఆ తర్వాత వీటిని మరోసారి సమీక్షిస్తామని యూఐడీఏఐ స్పష్టం చేసింది.

ఛార్జీల పెంపు నుంచి కొన్ని సేవలకు మినహాయింపు 
అయితే, ఈ ఛార్జీల పెంపు నుంచి కొన్ని సేవలకు మినహాయింపు ఇచ్చారు. పిల్లలకు ఐదేళ్లు, పదిహేనేళ్లు నిండినప్పుడు తప్పనిసరిగా చేయించాల్సిన బయోమెట్రిక్ అప్‌డేట్‌ను మునుపటిలాగే ఉచితంగానే అందిస్తారు. అలాగే, కొత్తగా పుట్టిన పిల్లలకు ఆధార్ నమోదు కూడా ఉచితంగానే కొనసాగుతుంది.

ఇంటి వద్ద సేవలు మరింత ప్రియం
ఆధార్ కేంద్రాలకు వెళ్లలేని వారి కోసం యూఐడీఏఐ అందిస్తున్న ఇంటి వద్దకే ఆధార్ సేవల (హోమ్ ఎన్‌రోల్‌మెంట్) ఛార్జీలను కూడా గణనీయంగా పెంచారు. ఇంటి వద్ద ఆధార్ నమోదు లేదా అప్‌డేట్ కోసం జీఎస్టీతో కలిపి రూ. 700 చెల్లించాల్సి ఉంటుంది. ఒకే ఇంట్లో ఒకరి కంటే ఎక్కువ మంది ఈ సేవను పొందితే, మొదటి వ్యక్తికి రూ. 700, ఆ తర్వాత ప్రతి అదనపు వ్యక్తికి రూ. 350 చొప్పున ఛార్జ్ చేస్తారు.


Go Back to Shorts
Aadhar Update Charges
UIDAI
Aadhar card
Aadhar update charges
biometric update
demographic update
Aadhar services
home enrollment
Aadhar fees
India Aadhar
Aadhar for children

More Telugu News