కన్నబిడ్డల కళ్లెదుటే ఆటో డ్రైవర్ దారుణ హత్య... వేళ్లు నరికి, పొడిచి చంపిన దుండగులు!

  • మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో ఘటన
  • పాత వ్యాపార గొడవలే కారణమని పోలీసుల అనుమానం
  • ఘటన జరిగిన 9 గంటల్లోనే ముగ్గురు నిందితుల అరెస్ట్
  • ప్రధాన నిందితుడిపై గతంలోనూ పలు కేసులు
మహారాష్ట్రలో ఒళ్లు గగుర్పొడిచే దారుణ ఘటన చోటుచేసుకుంది. పాత వ్యాపార గొడవల నేపథ్యంలో ఒక వ్యక్తిని, అతడి ఇద్దరు పసిబిడ్డల కళ్లెదుటే అత్యంత కిరాతకంగా హింసించి హత్య చేశారు. ఈ ఘోరం చూసిన ఆ చిన్నారులు భయంతో బిక్కచచ్చిపోయారు. బుధవారం ఛత్రపతి శంభాజీనగర్ నగరంలో జరిగిన ఈ అమానవీయ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

సయ్యద్ ఇమ్రాన్ షఫీక్ అనే వ్యక్తి తన 3, 13 ఏళ్ల కుమారులతో కలిసి ఆటోలో వెళ్తున్నాడు. సిల్క్ మిల్ కాలనీ ప్రాంతంలో రైల్వే స్టేషన్ సమీపంలోకి రాగానే, ఒక కారు వారి ఆటోను అడ్డగించింది. కారులో నుంచి దిగిన ఐదారుగురు దుండగులు, షఫీక్‌తో పాటు అతడి ఇద్దరు పిల్లలను బలవంతంగా ఆటోలో నుంచి బయటకు లాగారు.

అనంతరం, ఆ చిన్నారులు చూస్తుండగానే షఫీక్‌పై పదునైన ఆయుధాలతో దాడికి తెగబడ్డారు. ప్రాణభయంతో షఫీక్ వారి నుంచి ఆయుధాలు లాక్కోవడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అత్యంత పాశవికంగా ప్రవర్తించిన నిందితులు మొదట అతడి వేళ్లను నరికేశారు. ఆ తర్వాత కుడి చేతి మణికట్టును కోసి, తల, మెడపై విచక్షణారహితంగా కొట్టారు. చివరగా కత్తులతో పలుమార్లు పొడిచి, సమీపంలోని ఫుట్ ఓవర్‌బ్రిడ్జి కింద పడేసి వెళ్లిపోయారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. గ్యాస్ వ్యాపారంలో ఉన్న గొడవల కారణంగానే ఈ హత్య జరిగిందని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. కేవలం 9 గంటల వ్యవధిలోనే పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు ముజీబ్ డాన్‌పై గతంలోనూ అనేక కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో ముజీబ్ సోదరుడు సద్దాం హుస్సేన్ మొయినుద్దీన్, బావమరిది షేక్ ఇర్ఫాన్ షేక్ సులేమాన్ కూడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


More Telugu News