సోషల్ మీడియాలో అసభ్య పోస్టుల కట్టడికి ఏపీ సర్కార్ కీలక చర్యలు

  • ఐదుగురు మంత్రులతో కమిటీ వేసిన ఏపీ ప్రభుత్వం
  • కమిటీలో లోకేశ్, సత్యకుమార్, నాదెండ్ల, కొలుసు, అనిత
  • కమిటీకి కన్వీనర్‌గా వ్యవహరించనున్న పౌర సంబంధాల శాఖ కమిషనర్  
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామాజిక మాధ్యమాల్లో పెచ్చరిల్లుతున్న అసాంఘిక పోకడలకు అడ్డుకట్ట వేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. వ్యక్తుల గౌరవానికి భంగం కలిగించేలా, మతాలు, వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉండే పోస్టులను నియంత్రించేందుకు ప్రత్యేకంగా మంత్రులతో ఒక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ మంత్రుల కమిటీ సామాజిక మాధ్యమాల నియంత్రణకు సంబంధించి రాష్ట్రంలో అనుసరించాల్సిన విధానాలు, నిబంధనలను రూపొందించనుంది. వివాదాస్పద, విద్వేషపూరిత, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే కంటెంట్‌ను అడ్డుకునేందుకు చర్యలు సిఫారసు చేయనుంది.

కమిటీలో సభ్యులుగా విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, హోం మంత్రి వంగలపూడి అనిత నియమితులయ్యారు.

ఈ కమిటీకి సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. అవసరమైతే ఇతర ప్రభుత్వ శాఖల సహకారం, నిపుణుల సలహాలు కూడా కమిటీ తీసుకునే అవకాశం ఉంది. ఈ కమిటీ వీలైనంత త్వరగా సిఫార్సులను ప్రభుత్వానికి అందజేయనుంది. 


More Telugu News