జైల్లో నన్ను టెర్రరిస్టులా చూశారు... టీడీపీది పైశాచిక ఆనందం: మిథున్ రెడ్డి

  • తనను 73 రోజులు జైల్లో ఉంచారన్న మిథున్ రెడ్డి
  • సీసీ కెమెరాలు పెట్టి వేధించారని మండిపాటు
  • కోర్టు ఆదేశాలు ఇచ్చేంత వరకు కనీస వసతులు కూడా కల్పించలేదని విమర్శ
తెలుగుదేశం ప్రభుత్వంపై వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తీవ్రమైన ఆరోపణలు చేశారు. తనను జైలులో ఒక టెర్రరిస్టు మాదిరిగా చూశారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే బెయిల్‌పై విడుదలైన ఆయన, తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ తన అరెస్టు, జైలు జీవితం గురించి అనేక విషయాలను వెల్లడించారు. టీడీపీ ప్రభుత్వం కేవలం పైశాచిక ఆనందం కోసమే తనను అక్రమ కేసులతో వేధిస్తోందని ఆయన ఆరోపించారు.

"నన్ను 73 రోజుల పాటు జైల్లో ఉంచారు. ఆ సమయంలో నన్ను ఎవరితోనూ మాట్లాడనివ్వలేదు. సీసీ కెమెరాలతో నిరంతరం నిఘా పెట్టారు. విజయవాడ నుంచి నేరుగా పర్యవేక్షించారు. కనీసం జైలు అధికారులు కూడా నాతో మాట్లాడటానికి భయపడ్డారు. ఒక ఉగ్రవాదిని చూసినట్టుగా నన్ను ట్రీట్ చేశారు" అని మిథున్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు ఆదేశాలు ఇచ్చేంత వరకు తనకు కనీస వసతులు కూడా కల్పించలేదని, తనను కలవడానికి వచ్చిన వారిపై కూడా నిఘా పెట్టారని ఆయన వివరించారు. ఇది ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని అన్నారు.

టీడీపీ అధికారంలోకి వచ్చిన ప్రతీసారి తనను ఇలాగే ఇబ్బందులకు గురిచేస్తోందని, 2014-2019 మధ్య కాలంలో కూడా తనపై అక్రమ కేసులు పెట్టారని గుర్తుచేశారు. ప్రభుత్వం చేయాల్సిన పనులను పక్కనపెట్టి, ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇలాంటి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఈ కేసుల ద్వారా తన తల్లిదండ్రులను మానసిక వేదనకు గురిచేశారని అన్నారు.

ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తాను వెనక్కి తగ్గేది లేదని మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ అక్రమ కేసులకు తాను భయపడనని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని అన్నారు. కష్టకాలంలో తనకు అండగా నిలిచిన వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌కు, మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. 
Go Back to Shorts

More Telugu News