ప్రమాదకరస్థాయిలో మంజీరా ప్రవాహం.. ఏడుపాయల ఆలయానికి వెళ్లే దారులన్ని మూసివేత
మంజీరా నది ఉగ్రరూపం దాల్చడంతో ఏడుపాయల వనదుర్గా ఆలయానికి వెళ్లే మార్గాలన్నింటినీ అధికారులు మూసివేశారు. వరద ఉద్ధృతి తగ్గకపోవడంతో గత 17 రోజులుగా వనదుర్గా భవానీ ఆలయం మూసివేసి ఉంది. ఆలయ ప్రాంగణం ఎదుట మంజీరా నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది.
ఆలయం మూసివేసి ఉండటంతో రాజగోపురంలో ఉత్సవ విగ్రహానికి పూజలు నిర్వహిస్తున్నారు. రాజగోపురంలో సరస్వతిదేవిగా అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో మంజీరా నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో గత కొన్నిరోజులుగా ఏడుపాయల ఆలయం మూసివేసి ఉంది.