42 శాతం రిజర్వేషన్ వల్ల ఎవరికీ నష్టం జరగదు.. సహకరించండి: మంత్రి పొన్నం ప్రభాకర్

  • స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్‌కు సహకరించాలని విజ్ఞప్తి
  • రిజర్వేషన్‌లలో మార్పులు చేసుకోవడానికి రాజ్యాంగం అవకాశం కల్పించిందన్న మంత్రి
  • న్యాయపరంగా, చట్టపరంగా ముందుకు వెళతామన్న పొన్నం ప్రభాకర్
42 శాతం రిజర్వేషన్ వల్ల ఎవరికీ నష్టం వాటిల్లదని, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్‌లకు అందరూ సహకరించాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. 50 శాతం రిజర్వేషన్ పరిమితి గురించి కొందరు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, మార్పులు చేసుకోవడానికి రాజ్యాంగం అవకాశం కల్పించిందని గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయడానికి న్యాయపరంగా, చట్టపరంగా ప్రభుత్వం ముందుకు వెళుతుందని మంత్రి తెలిపారు. అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లకు ప్రతిపక్ష పార్టీలు మద్దతు ఇచ్చాయని ఆయన గుర్తు చేశారు.

ఇప్పుడు మాట మార్చకుండా సహకరించాలని ఆయన కోరారు. అందరి మద్దతుతోనే స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం ముందుకు వెళుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని న్యాయస్థానంలో కూడా ప్రస్తావిస్తామని ఆయన అన్నారు.


More Telugu News