తిలక్ వర్మ, భలే ఆడావ్.. టీమిండియా విజయంపై మెగాస్టార్ స్పెష‌ల్ పోస్ట్‌

  • ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం
  • భారత జట్టుకు మెగాస్టార్ చిరంజీవి అభినందనలు
  • తెలుగు తేజం తిలక్ వర్మపై చిరంజీవి ప్రత్యేక ప్రశంసలు
  • టీమిండియాను కొనియాడిన మమ్ముట్టి, మోహన్ లాల్, నిఖిల్
ఆసియా కప్ ఫైనల్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై టీమిండియా అద్భుత విజయం సాధించింది. ఈ చారిత్రక గెలుపుతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. భారత జట్టు ప్రదర్శించిన పోరాట స్ఫూర్తిపై సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి భారత జట్టును అభినందిస్తూ, తెలుగు ఆటగాడు తిలక్ వర్మను ప్రత్యేకంగా కొనియాడారు.

సోమవారం సోషల్ మీడియా వేదికగా చిరంజీవి తన స్పందనను తెలియజేశారు. "ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్థాన్‌పై ఎంతటి అద్భుత విజయం ఇది. టీమిండియా పోరాట స్ఫూర్తి, నైపుణ్యం, సంయమనం ప్రదర్శించింది. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన తిలక్ వర్మకు అభినందనలు. ప్రతి భారతీయుడికి ఇది గర్వకారణం. జై హింద్" అంటూ ఆయన ట్వీట్ చేశారు.

అలాగే, ఇంకా పలువురు సినీ తారలు కూడా టీమిండియాకు శుభాకాంక్షలు తెలిపారు. మలయాళ సూపర్ స్టార్లు మమ్ముట్టి, మోహన్ లాల్ భారత జట్టు ప్రదర్శనను కొనియాడారు. "టీమిండియా కేవలం ఆసియా కప్ గెలవడమే కాదు, దానిపై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ఒక్క ఓటమి కూడా లేకుండా ఛాంపియన్లుగా నిలిచింది" అని మమ్ముట్టి పేర్కొన్నారు. యువ నటుడు నిఖిల్ సిద్ధార్థ కూడా తిలక్ వర్మను ప్రశంసిస్తూ తన సంతోషాన్ని పంచుకున్నారు. కాగా, పాకిస్థాన్‌పై టీ20 ఫార్మాట్‌లో భారత్‌కు ఇది వరుసగా తొమ్మిదో విజయం కావడం విశేషం.


More Telugu News