: అంతరించిపోతున్న పక్షి జాతి కోసం 50 కోట్లు ఖర్చు

  • అత్యంత అరుదైన పక్షి ‘కలివికోడి’ సంరక్షణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కృషి
  • కొండూరు సమీపంలో 3 వేల ఎకరాల్లో అభయారణ్యం ఏర్పాటు
  • తొలిసారిగా 1848లో పెన్నా నది పరీవాహక ప్రాంతంలో గుర్తింపు
అంతరించిపోతున్న ఓ పక్షి జాతిని సంరక్షించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రూ.కోట్లల్లో ఖర్చు చేస్తున్నాయి. ఏకంగా 3 వేల ఎకరాల్లో అభయారణ్యం ఏర్పాటు చేశాయి. ఎనభైలలోనే అంతరించిపోయిందనుకున్న పక్షి ‘కలివికోడి’ కోసం తిరుపతి ఎస్వీయూ పరిశోధకుల బృందం నాలుగేళ్ల పాటు అన్వేషణ జరిపింది. వైఎస్సార్‌ కడప జిల్లా బద్వేలు ప్రాంతంలోని లంకమలలో 2002లో ముంబయి నేచురల్‌ హిస్టరీ సొసైటీ ఈ పక్షి పాదముద్ర, కూతను రికార్డు చేసింది.

జిల్లాలోని కొండూరు సమీపంలోని చిట్టడవుల్లో ఈ పక్షుల జాడ కనిపించడంతో ప్రభుత్వం అక్కడ 3 వేల ఎకరాల్లో శ్రీలంకమల్లేశ్వర అభయారణ్యాన్ని ఏర్పాటుచేసింది. అక్కడ కలివికోడి ఉనికిని గుర్తించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.50 కోట్ల వరకూ వెచ్చించాయి. పక్షి పరిశోధక బృందం సభ్యులు గత జులై, ఆగస్టు నెలల్లో అక్కడ వారాల తరబడి పరిశోధనలు సాగించి ఈ పక్షిని గుర్తించారు. వాటి కూతను రికార్డు చేశారు.
 
కలివికోడి సుమారు 27 సెంటీమీటర్ల పొడవు ఉంటుందని, దీని కూత దాదాపు 200 మీటర్ల దూరం వరకు వినిపిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ఎగిరే సామర్థ్యం లేకపోవడంతో కలివికోడి దట్టమైన పొదల్లో నివసిస్తుంటుందని తెలిపారు. పగటిపూట నిద్రించడం, రాత్రిపూట ఆహారం కోసం అన్వేషించడం కలివికోడి లక్షణమని, గులక రాళ్లను సేకరించి వాటి మధ్య గుడ్లు పెడతాయని పేర్కొన్నారు.

తొలిసారిగా 1848లో పెన్నా నది పరీవాహక ప్రాంతంలో కలివికోడి కనిపించిందని పరిశోధకులు తెలిపారు. అనంతరం 1985 జనవరి 5న రెడ్డిపల్లె వాసి చిన్న ఐతన్న ఈ పక్షిని పట్టుకుని అటవీశాఖ అధికారులకు అప్పగించారు. ఆ తర్వాత ఈ జాతి అంతరించిపోయినట్లు పక్షిశాస్త్ర నిపుణులు చెబుతూ వచ్చారు.

More Telugu News