ఇక ఏఐ శకమే.. 2030 నాటికి సూపర్‌ ఇంటెలిజెన్స్‌ రాక.. ఓపెన్‌ఏఐ సీఈవో

  • 40 శాతం ఉద్యోగాలను ఏఐ భర్తీ చేయగలదని చెప్పిన శామ్ ఆల్ట్‌మన్‌
  • కొన్ని పనులు కనుమరుగై, కొత్త తరహా ఉద్యోగాలు పుట్టుకొస్తాయని వెల్లడి
  • యాక్సెల్ స్ప్రింగర్ అవార్డు వేడుకలో ఓపెన్‌ఏఐ సీఈవో కీలక వ్యాఖ్యలు
ప్రపంచ టెక్నాలజీ రంగంలో సంచలనాలు సృష్టిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) భవిష్యత్తుపై ఓపెన్‌ఏఐ సీఈవో శామ్ ఆల్ట్‌మన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. 2030 నాటికి ఏఐ మానవ మేధస్సును మించిపోయే 'సూపర్ ఇంటెలిజెన్స్‌'గా అవతరించడమే కాకుండా, సమీప భవిష్యత్తులోనే 40 శాతం ఉద్యోగాలను భర్తీ చేయగలదని ఆయన సంచలన అంచనా వేశారు.

ఈ ఏడాదికి గాను ప్రతిష్ఠాత్మక యాక్సెల్ స్ప్రింగర్ అవార్డును అందుకున్న అనంతరం ఆయన మాట్లాడారు. ఒకప్పుడు కేవలం సైన్స్‌ ఫిక్షన్‌ కథలకే పరిమితమైన ఏఐ ఇప్పుడు ప్రతి పనిలోనూ భాగమైందని గుర్తుచేశారు. "2030 నాటికి మనం చేయలేని పనులను చేసే అసాధారణ సాంకేతికత మన వద్ద ఉంటుందని నేను నమ్ముతున్నాను" అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మానవ పరిధికి మించిన ఆవిష్కరణలను ఏఐ త్వరలోనే చేయగలదని ఆయన పేర్కొన్నారు.

అయితే, సాంకేతిక అభివృద్ధి సానుకూల అంశమే అయినప్పటికీ ఇది ఉద్యోగ విఫణిపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన అంగీకరించారు. ఏఐ రాకతో కొన్ని రంగాల్లోని ఉద్యోగాలు పూర్తిగా కనుమరుగవుతాయని, అదే సమయంలో మరికొన్ని రంగాల్లో పూర్తిగా కొత్త తరహా ఉద్యోగాలు పుట్టుకొస్తాయని వివరించారు. ఈ మార్పుల నేపథ్యంలో ఏది వచ్చినా దాన్ని స్వీకరించి, నిరంతరం కొత్త విషయాలు నేర్చుకోవడం చాలా ముఖ్యమని శామ్ ఆల్ట్‌మన్ సూచించారు. భవిష్యత్తులో రాబోయే సాంకేతిక మార్పులకు ప్రపంచం సిద్ధంగా ఉండాలని ఆయన పరోక్షంగా హెచ్చరించారు.


More Telugu News