ఆపరేషన్ సిందూర్ సమయంలో కూడా అందాల పోటీలు నిర్వహించాం: రేవంత్ రెడ్డి

  • హైదరాబాద్ అత్యంత సురక్షితమైన నగరమని నిరూపించామన్న ముఖ్యమంత్రి
  • శాంతిభద్రతల విషయంలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నామని వ్యాఖ్య
  • హైదరాబాద్ అంటే ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ అన్న రేవంత్ రెడ్డి
ఆపరేషన్ సిందూర్ సమయంలో కూడా హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించి, ఇది అత్యంత సురక్షితమైన నగరమని నిరూపించామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో రక్షణ, శాంతిభద్రతల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని, శాంతిభద్రతల విషయంలో దేశంలోనే హైదరాబాద్ మొదటి స్థానంలో ఉందని కేంద్రం ప్రకటించిందని ఆయన తెలిపారు.

శిల్పారామంలో ఏర్పాటు చేసిన 'ప్రపంచ పర్యాటక దినోత్సవం' కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో కొత్త టూరిజం పాలసీని తీసుకువచ్చినట్లు తెలిపారు. గోల్కొండ, రామోజీ ఫిల్మ్ సిటీ వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలు హైదరాబాద్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. ఎకో, మెడికల్, హెల్త్ టెంపుల్ టూరిజాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించినట్లు చెప్పారు.

హైదరాబాద్ అంటే ఓల్డ్ సిటీ కాదని, ఒరిజినల్ సిటీ అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రపంచ ప్రఖ్యాత నగరాలతో హైదరాబాద్ పోటీ పడుతోందని ఆయన అన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు. పెట్టుబడులు పెట్టే వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.


More Telugu News