వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఇవ్వండి.. హైదరాబాద్ ఐటీ కంపెనీలకు పోలీసుల సూచన

  • బంగాళాఖాతంలో అల్పపీడనంతో హైదరాబాద్‌లో భారీ వర్షాలు
  • నిన్న రాత్రి నుంచి నగరంలో ఎడతెరిపిలేని వాన
  • చెరువులను తలపిస్తున్న ప్రధాన రహదారులు, భారీగా ట్రాఫిక్ జామ్‌లు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వానకు నగర జీవనం స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నగరంలోని ఐటీ కంపెనీలకు కీలక సూచనలు జారీ చేశారు. భారీ వర్షాల కారణంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఉద్యోగులకు 'వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌' ప్రకటించాలని కోరారు.

నగరంలోని అమీర్‌పేట్‌, కూకట్‌పల్లి, మియాపూర్‌, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, పంజాగుట్టతో పాటు సికింద్రాబాద్, ఉప్పల్, ఎల్బీనగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, ఖైరతాబాద్‌ వంటి అన్ని ప్రధాన ప్రాంతాల్లోనూ ఏకధాటిగా వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులన్నీ చెరువులను తలపిస్తుండటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. అత్యవసర పనులు ఉంటే తప్ప ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా ఐటీ కారిడార్లలో ట్రాఫిక్‌ రద్దీని తగ్గించేందుకు కంపెనీలు సహకరించాలని, ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసే వెసులుబాటు కల్పించాలని తెలిపారు. ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమవడం వల్లే తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. 


More Telugu News