శ్రీవారి భక్తులకు తిరుమలలో అత్యాధునిక వసతి సదుపాయం పీఏసీ‌‌–5

  • తిరుమలలో యాత్రికుల వసతి సముదాయాన్ని ప్రారంభించిన ఉపరాష్ట్రపతి, ఏపీ సీఎం
  • బుకింగ్ లేకున్నా ఒకేసారి 4 వేల మంది భక్తులకు వసతి
  • 16 డార్మిటరీలు, 2,400 లాకర్లు, 24 గంటలూ వేడి నీటి సదుపాయం
శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం తిరుమలలో మరో అత్యాధునిక వసతి గృహం అందుబాటులోకి వచ్చింది. భక్తుల సౌలభ్యం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.102 కోట్లు వెచ్చించి వేంకటాద్రి నిలయం యాత్రికుల వసతి సముదాయం (పీఏసీ–5)ను నిర్మించింది. ఈ వసతి సముదాయాన్ని ఈరోజు ఉదయం ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నారా లోకేశ్, ఆనం రామనారాయణరెడ్డి, అనగాని సత్యప్రసాద్‌, టీటీడీ చైర్మన్ బీఆర్‌ నాయుడు, ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌, అధికారులు పాల్గొన్నారు.

ఒకేసారి 4 వేల మందికి వసతి..
వేంకటాద్రి వసతి సముదాయంలో ఒకేసారి 4 వేల మందికి వసతి సౌకర్యం కల్పించవచ్చు. ఇందులో 16 డార్మిటరీలు, 2,400 లాకర్లు, ఒకేసారి 1400 మంది భోజనం చేసేందుకు వీలుగా రెండు డైనింగ్‌ హాళ్లు ఉన్నాయి. భక్తులకు 24 గంటలూ వేడి నీటి సదుపాయం అందుబాటులో ఉంటుంది. ఒకేసారి 80 మంది తలనీలాలు సమర్పించేందుకు అనువుగా ప్రాంగణంలో కల్యాణకట్టను ఏర్పాటు చేశారు.


More Telugu News