APSDMA: రాగల 3 గంటల్లో పిడుగులతో వర్షాలు... ఏపీలో వివిధ జిల్లాలకు రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్

ఆంధ్రప్రదేశ్‌లో రాగల మూడు గంటల పాటు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నందున రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాల ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఆయన కోరారు.

అదేవిధంగా, శ్రీకాకుళం, కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. తిరుపతి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని, ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు తెలిపారు.

ఈ నేపథ్యంలో ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశువుల కాపరులు వెంటనే సురక్షిత భవనాల్లోకి వెళ్లాలని ప్రఖర్ జైన్ సూచించారు. వర్షం సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద నిలబడటం అత్యంత ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు.
APSDMA
Andhra Pradesh rains
heavy rainfall
weather alert
red alert
orange alert
yellow alert
lightning strikes
north Andhra
Prakhar Jain

More Telugu News