ఫుట్‌బాల్ మ్యాచ్‌లో కూడా పాకిస్థాన్ ఆటగాళ్ల పిచ్చి వేషాలు... భారత్ చేతిలో ఓటమి

  • శాఫ్ అండర్-17 ఛాంపియన్‌షిప్‌లో పాక్‌పై భారత్ ఘన విజయం
  • 3-2 గోల్స్ తేడాతో చిత్తు చేసిన భారత యువ జట్టు
  • గోల్ కొట్టి టీ తాగుతున్నట్లు రెచ్చగొట్టిన పాక్ ఆటగాడు
  • అభినందన్‌ను అవమానించేందుకేనని అభిమానుల ఆగ్రహం
  • గెలుపుతో పాక్‌కు బదులిచ్చి సెమీస్‌కు చేరిన భారత్
శాఫ్ అండర్-17 ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో భారత యువ జట్టు పాకిస్థాన్‌పై అద్భుత విజయాన్ని నమోదు చేసింది. మైదానంలో పాక్ ఆటగాడి రెచ్చగొట్టే చర్యకు బదులుగా, గోల్స్‌తో సమాధానమిచ్చి 3-2 తేడాతో పాక్‌ను చిత్తు చేసింది. ఈ విజయంతో గ్రూప్-బిలో అగ్రస్థానంలో నిలిచిన టీమిండియా ఘనంగా సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది.

ఆట ఆద్యంతం హోరాహోరీగా సాగింది. మ్యాచ్ 43వ నిమిషంలో పాకిస్థాన్ ఆటగాడు ముహమ్మద్ అబ్దుల్లా ఒక గోల్ సాధించాడు. అనంతరం అతను టీ తాగుతున్నట్లు వింతగా సంబరాలు చేసుకున్నాడు. ఈ సంబరాలు 2019 బాలాకోట్ దాడుల సమయంలో పాక్‌కు చిక్కిన భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌ను వెక్కిరించేందుకేనని అభిమానులు తీవ్రంగా స్పందించారు.

అయితే, ఈ అవమానానికి భారత ఆటగాళ్లు తమ ఆటతోనే గట్టి సమాధానం చెప్పారు. దాల్లుల్మున్ గాంగ్టే, గున్లీబా వాంగెరాక్పమ్ చెరొక గోల్ సాధించి స్కోరును సమం చేయగా, 73వ నిమిషంలో రహన్ అహ్మద్ అద్భుతమైన గోల్ కొట్టి భారత్‌కు నిర్ణయాత్మక విజయాన్ని అందించాడు. ఈ గెలుపుతో వరుసగా మూడు విజయాలు నమోదు చేసిన భారత జట్టు, సెమీ ఫైనల్‌లో నేపాల్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఓడిపోయినప్పటికీ పాకిస్థాన్ కూడా సెమీస్‌కు అర్హత సాధించింది. సెమీస్‌లో బంగ్లాదేశ్‌తో పాక్ ఆడనుంది. 


More Telugu News