పసికందు మృతి... ప్రభుత్వంపై జగన్ ఫైర్

  • కుయ్ కుయ్ మూగబోతోందంటూ జగన్ విమర్శ
  • పసికందు మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్
  • కలెక్షన్లపై ఉన్న శ్రద్ధ ప్రజలపై లేదా? అని ప్రశ్న
108 అంబులెన్స్ సరైన సమయానికి రాకపోవడంతో ఓ పసికందు ప్రాణాలు కోల్పోయిందంటూ వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన అత్యవసర సేవలను ప్రస్తుత ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు ఘటనకు సంబంధించిన వీడియోను తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసి, ప్రభుత్వ తీరును తప్పుబట్టారు.

"కుయ్‌.. కుయ్‌.. మూగబోతోంది. ప్రజల ప్రాణాలు పోతున్నాయి. ప్రజల ప్రాణాలకు భరోసా ఇచ్చే 108 సర్వీసులకు చంద్రబాబు ప్రభుత్వం ఉరివేస్తోంది. పాడేరు సమీపంలోని ముల్లుమెట్టకు చెందిన నిండు గర్భిణీని ఆస్పత్రికి తరలించేందుకు 108 రాకపోవడంతో ఆటోను ఆశ్రయించాల్సి వచ్చింది. చివరకు ఆటోలోనే ప్రసవం జరిగింది. వైద్యం అందక ఆటోలోనే శిశువు మరణించింది. 

వైసీపీ హయాంలో అంబులెన్స్‌లు, పట్టణ ప్రాంతాల్లో ఫోన్‌ చేసిన 15 నిమిషాల్లోగా 108 రావాలన్న నిబంధన ఉంటే, దాన్ని అధిగమిస్తూ 12-14 నిమిషాల్లోనే చేరుకునేవి. గ్రామీణ ప్రాంతాల్లో 20 నిమిషాల్లో చేరుకోవాలని నిబంధన ఉంటే, 16-17 నిమిషాల్లోనూ, గిరిజన ప్రాంతాల్లో 30 నిమిషాల్లో చేరుకోవాలని నిబంధన ఉంటే, దీన్నికూడా అధిగమిస్తూ  22 నిమిషాల్లోనే చేరుకుని 108లు సేవలందించాయి. మరి ఎందుకు ఇప్పుడు చేరుకోవడం లేదు? ఫోన్‌ చేసినా ఎందుకు రావడం లేదు? ప్రభుత్వం అన్నది పనిచేస్తేనేకదా! కలెక్షన్ల మీద తప్ప ప్రజలమీద ధ్యాస ఉంటేకదా!" అని విమర్శించారు.


More Telugu News