నేను ఎవరినీ కించపచర్చలేదు... అన్ని మతాలను గౌరవిస్తాను: సీజేఐ బీఆర్ గవాయ్

  • విష్ణుమూర్తి విగ్రహంపై తన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంపై స్పందించిన సీజేఐ
  • తాను అన్ని మతాలను గౌరవిస్తానని, ఎవరినీ కించపరచలేదని స్పష్టీకరణ
  • ఇదంతా సోషల్ మీడియాలో జరిగిన ప్రచారమేనని వ్యాఖ్య
  • సీజేఐకి మద్దతుగా మాట్లాడిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా
  • ప్రతి చర్యకు సోషల్ మీడియాలో అసమాన ప్రతిచర్య ఉంటోందని వ్యాఖ్య
  • ఖజురహో విగ్రహం పునరుద్ధరణ పిటిషన్‌ను తిరస్కరిస్తూ సీజేఐ ఈ వ్యాఖ్యలు చేశారు
మధ్యప్రదేశ్‌లోని ఖజురహో ఆలయంలో శిరస్సు లేని పురాతన విష్ణుమూర్తి విగ్రహం పునరుద్ధరణకు సంబంధించిన పిటిషన్‌పై తాను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంపై భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ బీఆర్ గవాయ్ గురువారం స్పందించారు. తాను అన్ని మతాలను గౌరవిస్తానని, ఎవరి మనోభావాలను దెబ్బతీయడం తన ఉద్దేశం కాదని ఆయన స్పష్టం చేశారు.

సెప్టెంబర్ 16న ఈ పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం.. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని, ఇది పురావస్తు శాఖ (ఏఎస్ఐ) పరిధిలోని అంశమని తేల్చిచెప్పింది. ఈ సందర్భంగా పిటిషనర్‌తో మాట్లాడుతూ, "మీరు విష్ణుమూర్తికి పరమ భక్తుడినని అంటున్నారు కదా. పరిష్కారం కోసం దేవుడినే వెళ్లి ప్రార్థించండి" అని జస్టిస్ గవాయ్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు హిందూ మనోభావాలను కించపరిచేలా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేగింది.

ఈ నేపథ్యంలో గురువారం కోర్టులో ఈ అంశం ప్రస్తావనకు రాగా, జస్టిస్ గవాయ్ వివరణ ఇచ్చారు. "నేను అన్ని మతాలను గౌరవిస్తాను. ఇదంతా సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం" అని ఆయన అన్నారు.

ఈ సమయంలో కలుగజేసుకున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీజేఐకి మద్దతుగా మాట్లాడారు. సోషల్ మీడియాలో కొన్ని సంఘటనలకు అసాధారణమైన స్పందనలు వస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. "ప్రతి చర్యకు సమానమైన ప్రతిచర్య ఉంటుందని న్యూటన్ సూత్రం చెబుతుంది. కానీ ఇప్పుడు ప్రతి చర్యకు సోషల్ మీడియాలో అసమానమైన ప్రతిచర్య కనిపిస్తోంది" అని ఆయన వ్యాఖ్యానించారు.

మధ్యప్రదేశ్‌లోని యునెస్కో గుర్తింపు పొందిన ఖజురహో ఆలయాల సముదాయంలోని జవారి ఆలయంలో ఏడడుగుల విష్ణుమూర్తి విగ్రహం శిరస్సు లేకుండా ఉంది. మొఘలుల దండయాత్రల సమయంలో ఈ విగ్రహాన్ని ధ్వంసం చేశారని, స్వాతంత్ర్యం వచ్చి 77 ఏళ్లు గడిచినా దాన్ని పునరుద్ధరించలేదని రాకేశ్ దలాల్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విగ్రహాన్ని పునరుద్ధరించకపోవడం భక్తుల ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని ఆయన వాదించారు. అయితే ఈ పిటిషన్‌ను విచారించేందుకు కోర్టు నిరాకరించింది.


More Telugu News