Mumbai: దేశంలో భారీగా పెరిగిన మిలియనీర్ కుటుంబాలు... అగ్రస్థానంలో ముంబై

Mumbai Tops in India Millionaire Families Growth Report
షార్ట్స్‌లో చూడండి
భారతదేశంలో సంపద సృష్టి కొనసాగుతోంది. గత నాలుగేళ్లలో దేశంలో మిలియనీర్ కుటుంబాల సంఖ్య ఏకంగా 90 శాతం పెరిగింది. రూ. 8.5 కోట్లకు పైగా నికర ఆస్తులున్న కుటుంబాలు భారీగా పెరిగినట్లు మెర్సిడెస్-బెంజ్, హూరున్ ఇండియా సంయుక్తంగా విడుదల చేసిన తాజా నివేదిక వెల్లడించింది.

ఈ నివేదిక ప్రకారం, 2021లో 4.58 లక్షలుగా ఉన్న మిలియనీర్ కుటుంబాల సంఖ్య, 2025 నాటికి 8.71 లక్షలకు చేరింది. దేశంలో అత్యధికంగా 1.42 లక్షల సంపన్న కుటుంబాలతో ముంబై 'మిలియనీర్ల రాజధాని'గా నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో ఢిల్లీ (68,200), బెంగళూరు (31,600) ఉన్నాయి. రాష్ట్రాల పరంగా చూస్తే, 1.78 లక్షల మిలియనీర్ కుటుంబాలతో మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతోంది.

మిలియనీర్ల ఆసక్తులు

ఈ సంపన్నుల పెట్టుబడి అలవాట్లను పరిశీలిస్తే, వారు ఎక్కువగా స్టాక్స్, రియల్ ఎస్టేట్, బంగారం వైపు మొగ్గు చూపుతున్నట్లు తేలింది. వీరిలో 35 శాతం మంది డిజిటల్ చెల్లింపుల కోసం యూపీఐ యాప్‌లనే ఎక్కువగా ఉపయోగిస్తున్నారని సర్వేలో వెల్లడైంది. మరోవైపు, దేశంలోని అత్యంత సంపన్నులలో మొదటి 1 శాతం మంది తమ సంపదలో 60 శాతాన్ని రియల్ ఎస్టేట్, బంగారంలోనే దాచుకున్నారని ఇటీవల వెలువడిన ఇతర నివేదికలు చెబుతున్నాయి. దేశ మొత్తం సంపదలో 59 శాతం వీరి వద్దే కేంద్రీకృతమై ఉంది.

ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి నెలకొన్నప్పటికీ, దేశంలో సంపద సృష్టి బలంగా ఉందని ఈ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారత జీడీపీ 7.8 శాతం వృద్ధి నమోదు చేయడం ఈ అంచనాలకు బలాన్ని చేకూరుస్తోంది.
Go Back to Shorts
Mumbai
Indian Millionaire Families
Millionaire families India
Richest families India
Mercedes-Benz Hurun India Report

More Telugu News