స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది: మంత్రి సీతక్క

  • ప్రజల సంక్షేమం, అభివృద్ధి అందించడమే ధ్యేయమన్న మంత్రి
  • రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నప్పటికీ ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారని ఆగ్రహం
  • గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులమయం చేసిందని ధ్వజం
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి సీతక్క తెలిపారు. ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీలో పర్యటించిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రజల సంక్షేమం, అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తోందని అన్నారు.

తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ నిరాధార ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా సరఫరా బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని, ఈ విషయంలో రైతులను తప్పుదోవ పట్టించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదని ఆమె అన్నారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని ఆమె విమర్శించారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు తక్షణమే మరమ్మతులు చేయిస్తామని ఆమె హామీ ఇచ్చారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని ఆమె స్పష్టం చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని ఆమె డిమాండ్ చేశారు.


More Telugu News