Salman Agha: ఏ జట్టునైనా ఓడిస్తాం... టీమిండియాకు పాక్ కెప్టెన్ పరోక్ష హెచ్చరిక!

Salman Agha warns rivals Pakistan ready for India
షార్ట్స్‌లో చూడండి
ఆసియా కప్ టీ20 టోర్నీలో పాకిస్థాన్ శుభారంభం చేయడం తెలిసిందే. తమ తొలి మ్యాచ్‌లో ఒమన్‌ను 93 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడించింది. ఈ గెలుపు అనంతరం పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ ఆఘా పూర్తి ఆత్మవిశ్వాసంతో మాట్లాడాడు. తమ జట్టుకు ఏ ప్రత్యర్థినైనా ఓడించగల సత్తా ఉందని, ముఖ్యంగా ఆదివారం జరగనున్న కీలక మ్యాచ్‌లో భారత్‌ను కూడా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ధీమా వ్యక్తం చేశాడు.

ఈ మ్యాచ్ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సల్మాన్ మాట్లాడుతూ, "గత రెండు, మూడు నెలలుగా మా జట్టు అద్భుతమైన క్రికెట్ ఆడుతోంది. మా ప్రణాళికలను కనుక సరిగ్గా అమలు చేస్తే, మేం ఏ జట్టునైనా ఓడించగలం" అని స్పష్టం చేశాడు. భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నప్పటికీ, తాము మంచి క్రికెట్ ఆడితే విజయం తమనే వరిస్తుందని అన్నాడు.

అంతకుముందు జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్, నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. ఓపెనర్ మహమ్మద్ హారిస్ (43 బంతుల్లో 66; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టుకు భారీ స్కోరు అందించాడు. అతడికి 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది. అయితే, బ్యాటింగ్ విభాగంలో తాము మరిన్ని పరుగులు చేయాల్సిందని, సుమారు 180 పరుగులు సాధించి ఉంటే బాగుండేదని కెప్టెన్ సల్మాన్ అభిప్రాయపడ్డాడు.

అనంతరం లక్ష్య ఛేదనలో పాకిస్థాన్ బౌలర్లు నిప్పులు చెరిగారు. వారి ధాటికి ఓమాన్ జట్టు 16.4 ఓవర్లలో కేవలం 67 పరుగులకే కుప్పకూలింది. పాక్ బౌలర్లలో సయీం అయూబ్, ఫహీమ్ అష్రఫ్, సుఫియాన్ ముఖీమ్ తలా రెండు వికెట్లు పడగొట్టి ఒమన్ పతనాన్ని శాసించారు. "మా బౌలింగ్ ప్రదర్శన అద్భుతంగా ఉంది. ముఖ్యంగా మా స్పిన్నర్లు యూఏఈ పిచ్‌లపై చాలా కీలకం" అని సల్మాన్ తన బౌలర్లను ప్రశంసించాడు. ఈ విజయంతో పాకిస్థాన్ ఆత్మవిశ్వాసంతో ఉండగా, ఆదివారం జరగనున్న భారత్-పాక్ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Go Back to Shorts
Salman Agha
Pakistan cricket
Asia Cup T20
India vs Pakistan
Pakistan vs Oman
Mohammad Haris
cricket news
UAE pitches
Saheem Ayub
Fahim Ashraf

More Telugu News