భారత్-పాక్ మ్యాచ్‌కు క్రేజ్ తగ్గిందా? ఇంకా అమ్ముడుపోని టికెట్లు!

  • ఆసియా కప్‌లో భారత్-పాక్ మ్యాచ్‌ పట్ల తగ్గిన ఆసక్తి
  • 10 రోజులు దాటినా అమ్ముడుపోని వేలాది టిక్కెట్లు
  • ప్రీమియం సీటు ధర ఏకంగా రూ. 4 లక్షలుగా నిర్ణయం
  • గతంలో నిమిషాల్లోనే అమ్ముడైన టికెట్లు
  • బాయ్‌కాట్ పిలుపులే కారణమనే బలమైన వాదనలు
  • ఆటపైనే దృష్టి పెట్టాలన్న మాజీ కెప్టెన్ కపిల్ దేవ్
క్రికెట్ ప్రపంచంలో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ దాయాదుల పోరు కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతాయి. కానీ, ఈసారి ఆసియా కప్ 2025లో పరిస్థితి భిన్నంగా ఉంది. దుబాయ్ వేదికగా ఎల్లుండి (14న) జరగనున్న ఈ మ్యాచ్ టికెట్లు అమ్మకానికి పెట్టి పది రోజులు దాటినా ఇంకా అందుబాటులోనే ఉన్నాయి. ముఖ్యంగా, ప్రీమియం సీటు ధర సుమారు 4 లక్షల రూపాయలు పలుకుతున్నా వాటిని కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ కోసం ఆగస్టు 29న అధికారిక భాగస్వామి ప్లాటినమ్‌లిస్ట్ ద్వారా టిక్కెట్ల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. గురువారం రాత్రి 9 గంటల సమయానికి కూడా స్టేడియంలోని దాదాపు 50 శాతం స్టాండ్లలో టికెట్లు మిగిలే ఉన్నాయి. అందుబాటులో ఉన్న టికెట్ల కనీస ధర 99 డాలర్ల (సుమారు రూ. 8,200) నుంచి మొదలవుతుండగా, ప్రీమియం సీట్ల ధరను 4,534 డాలర్లకు (సుమారు రూ. 4 లక్షలు) నిర్ణయించారు. తక్కువ ధర కలిగిన టికెట్లు ఇప్పటికే అమ్ముడయ్యాయి.

గతంలో ఇదే వేదికపై 2023 చాంపియన్స్ ట్రోఫీలో ఇరు జట్లు తలపడినప్పుడు కేవలం నాలుగు నిమిషాల్లోనే టికెట్లన్నీ అమ్ముడయ్యాయి. ఆ రికార్డును దృష్టిలో ఉంచుకుని ఈసారి కూడా అదే స్పందన వస్తుందని ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) భావించింది. కానీ, అభిమానుల నుంచి ఊహించిన రీతిలో స్పందన రాకపోవడంతో ఈసీబీ అధికారి ఒకరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే, మరో అధికారి మాత్రం ‘బుకింగ్స్ ప్రోత్సాహకరంగానే ఉన్నాయి’ అని చెబుతున్నప్పటికీ, వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది.

బాయ్‌కాట్ పిలుపులే కారణమా?
ఇటీవల పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి, దానికి ప్రతిగా పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత్ నిర్వహించిన ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ నేపథ్యంలో భారత్‌లో మ్యాచ్‌ను బహిష్కరించాలంటూ కొందరు మాజీ క్రికెటర్లు, క్రీడా పండితుల నుంచి పిలుపులు వెల్లువెత్తాయి. ఈ ప్రభావమే టికెట్ల అమ్మకాలపై పడిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ వివాదంపై స్పందించిన భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ "ఆటగాళ్లు ఆటపైనే దృష్టి పెట్టాలి. మైదానంలోకి వెళ్లి గెలవడమే వారి పని. ప్రభుత్వం తన పని తాను చేస్తుంది" అని హితవు పలికారు. కేవలం బహుళ దేశాల టోర్నమెంట్లలోనే పాకిస్థాన్‌తో ఆడతామని, ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడబోమని కేంద్ర ప్రభుత్వ విధానానికే కట్టుబడి ఉన్నామని బీసీసీఐ స్పష్టం చేసింది.

మరోవైపు, ఈ వివాదాలతో సంబంధం లేకుండా ఇరు జట్ల ఆటగాళ్లు మ్యాచ్ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. పాకిస్థాన్‌తో తలపడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపారు. తమ సహజమైన ఆటతీరుతోనే బరిలోకి దిగుతామని పాకిస్థాన్ సారథి సల్మాన్ అఘా పేర్కొన్నాడు. కాగా, ఈ టోర్నీలో భారత్ ఇప్పటికే యూఏఈపై ఘన విజయం సాధించగా, పాకిస్థాన్ శుక్రవారం ఒమన్‌తో తలపడనుంది.


More Telugu News